ఇంటింటికీ చెత్త సేకరణతో కనిపించని చెత్త కుప్పలు
డ్రైనేజీలనిర్మాణంతో తీరిన మురుగు సమస్య
ప్రతి వీధిలో సీసీరోడ్ల్డు.. పచ్చని మొక్కలు
పూర్తయిన ప్రగతి పనులు
ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 16 : గతంలో మురుగు, పెంటకుప్పలతో కంపు కొట్టిన వీధులు.. నేడు పచ్చదనం, పరిశుభ్రంగా ఆహ్లాదం పంచుతున్నాయి. ఈగలు, దోమల బెడద తగ్గడంతో రోగాలవ్యాప్తికి అడ్డుకట్టపడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర సర్కార్ చేపట్టిన పల్లె ప్రగతితో మారుమూల గ్రామాలు కూడా అన్ని వసతులతో కళకళలాడుతున్నాయి. విస్తీర్ణంలో అతిచిన్నదైన ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. 230 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామం పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నది. వైకుంఠధామం, డంపింగ్యార్డు, వర్మీ కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం తదితర పనులను పకడ్బందీగా చేపట్టారు. ఎటుచూసినా హరితహారం మొక్కలు, గల్లీగల్లీకి సీసీరోడ్లు దర్శనమిస్తున్నాయి. రెండేండ్ల కాలంలోనే ఈ గ్రామానికి ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో సుమారు రూ.కోటి నిధులు అందాయి. వీటితో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి తాగునీటి నల్లాలు, వీధి దీపాలు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. అంతేకాకుండా ప్రతిరోజు ఇంటింటికీ చెత్తను సేకరించి కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు. హరితహారం మొక్కలకు నీటిని అందజేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. గ్రామ ఎంపీటీసీ ఏనుగు భరత్రెడ్డి తన సొంత డబ్బులతో గ్రామంలో కార్పోసిక్ట్రోన్ మొక్కలను నాటించి, ట్రీగార్డులు ఏర్పాటు చేయించి సంరక్షిస్తున్నాడు. పల్లె ప్రగతితో గ్రామానికి మహర్దశ వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.