ఉస్మానియా యూనివర్సిటీ : ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ విభాగంతో కలిసి ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బేగంపేటలోని సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమంలో మలేరియా పరాన్నజీవిని గుర్తించిన రోనాల్డ్ రాస్ స్మారకంగా పోస్టల్ కవర్ను ఆవిష్కరించనున్నట్లు ఓయూ పీఆర్వో డాక్టర్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారని వివరించారు. ఓయూ జువాలజీ విభాగం ఆధ్వర్యంలో 1955లో సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీని స్థాపించారని గుర్తు చేశారు. రోనాల్డ్ రాస్ దోమలపై తన పరిశోధనను సాగించినది ఈ ప్రతిష్టాత్మక భవనంలోనేనని చెప్పారు.
సికింద్రాబాద్లోని రెజిమింట్లో మెడికల్ ఆఫీసర్గా విధుల్లో చేరిన రోనాల్డ్ రాస్, తన పరిశోధనలు కొనసాగిస్తూ 1897 ఆగస్టు 20వ తేదీన దోమలో మలేరియా పరాన్న జీవిని కనిపెట్టారని పేర్కొన్నారు. ఈ పరిశోధనకు 1902లో నోబెల్ ప్రైజ్ను సైతం పొందారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతీఏటా ఆగస్టు 20వ తేదీని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకుంటున్నారని చెప్పారు.