చాదర్ఘాట్ : నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఆజంపురా డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డివిజన్ పరిధిలోని ఆజంపురా చమన్, లారీ కాంట, సీ క్లాస్, టార్జాన్ గ్రౌండ్ ప్రాంతాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పాధయాత్ర నిర్వహించారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా టార్జాన్ గ్రౌండ్లోని పురాతన లైబ్రరీ స్థానంలో కొత్త లైబ్రరీ నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. సీ క్లాస్ క్వార్టర్స్, లారీ కాంట వద్ద వర్షం నీరు నిలిచే పాయింట్లలో కొత్తగా క్యాచ్ పిట్లు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అహ్మద్బలాల మాట్లాడుతూ వర్షం నీరు నిల్వ ఉండే చాలా చోట్ల సమస్య పరిష్కారానికి స్ట్రాం వాటర్ పైప్లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీ క్లాస్, ఆజంపురా కాంట వద్ద క్యాచ్ పిట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, టీఎస్ఎస్పీడీసీఎల్, జలమండలి అధికారులు, ఎంఐఎం నేతలు షేక్ మొహియుద్దీన్ అబ్రార్, అలీం తదితరులు పాల్గొన్నారు.