వెంగళరావునగర్ : మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ వాహనదారుడు తన బైక్తో ఏకంగా ట్రాఫిక్ పోలీసునే ఢీకొట్టా డు. ప్రమాదంలో గాయపడ్డ పోలీసు కానిస్టేబుల్ తలపగిలి తీవ్రగాయాలపాలై కొనప్రాణాలతో కొట్టుమిట్టాడు తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ తో సహా వాహనదారుడు పరారయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ మొబైల్ వ్యాన్లో కానిస్టేబుల్స్ సురేష్ కులకర్ణి (57) బాలరాజు, హోంగార్డు సురేష్ కుమార్లు అమీర్ పేట్ మైత్రీవనం జంక్షన్ లో శనివారం రాత్రి విధులు నిర్వహించారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కులకర్ణి సారధి స్టూడియో వైపు నుంచి పెట్రోల్ బంక్ వైపు నకు వెళ్లేందుకు రోడ్డు దాట సాగాడు. అమీర్ పేట్ వైపు నుంచి యూసుఫ్ గూడ వైపునకు వెళ్లే యాక్టీవా వాహనం అతివేగంతో దూసుకొచ్చి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ కులకర్ణిని ఢీకొంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సురేష్ కులకర్ణి తలపగిలి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడు తన బైక్ తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. రాత్రి సమయం కావడంతో చీకట్లో బైక్ తో సహా వాహనదారుడు తప్పించుకుని పారిపోయాడని తోటి పోలీసు సిబ్బంది చెప్తున్నారు.
గాయపడ్డ కానిస్టేబుల్ సురేష్ కులకర్ణిని అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రేయ తన వాహనంలో అమీర్ పేట్ లోని ఓ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్తున్నారని ఎస్.ఆర్.నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రేయ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడి కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవి ఫుటేజ్ సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.