ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ వీసీ చాంబర్లో ధర్నా చేపట్టారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ వర్సిటీలు విద్యావ్యాపారానికి తెరలేపడం దారుణమన్నారు. ఫీజులను ఒకేసారి రెట్టింపు చేయడమంటే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని మండిపడ్డారు. నూతనంగా నియమితులైన వీసీలు ప్రగల్భాలు మాని, శాస్త్రీయత లేకుండా అనాలోచితంగా ఫీజులు ఎలా పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.