మొయినాబాద్ : కొవిడ్-19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదిన్నర పాటు భక్తుల ప్రదక్షిణలు నిలిపివేయడం జరిగింది. కొవిడ్ కొంత సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు మహాప్రాకార ప్రదక్షిణలు చేసుకునే అవకాశం ఆలయ కమిటీ కల్పించింది. గత మూడు రోజులుగా భక్తులు ఆలయం బయట నుంచి మహాప్రాకార ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే సోమవారం ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, ప్రధాన అర్చకులు రంగరాజన్లు భక్తులతో పాటు మహాప్రాకార ప్రదక్షిణలు చేశారు.
స్వామి వారి ఉత్సహా విగ్రహాన్ని పట్టుకుని గోవింద నామస్మరణలు చేసుకుంటూ భక్తులతో పాటు మహాప్రాకార ప్రదక్షిణ లు చేశారు. అనంతరం ఆలయ గోపురం ముందు భాగంలో అర్చకులు రంగరాజన్ భక్తులకు మహాప్రాకార ప్రదక్షిణ గురించి అవగాహగాన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్-19 పూర్తిగా అదుపులోకి రాని కారణంగా భక్తుల ప్రధాన కోరిక మేరకు మహాప్రాకార ప్రదక్షిణలకు అవకాశం కల్పించమన్నారు.
గతంలో సాధారణ పరిస్థితులు ఉన్న సమయంలో భక్తులు ఆలయ ప్రధాన గర్బగుడి చుట్టూ 11, 108 ప్రదక్షిణలు చేసేవారు. కాని కొవిడ్ తీవ్రత ఉన్న సమయంలో ఆలయాన్ని పూర్తిగా మూసి వేశారు.కొవిడ్ కొంత సాధారణ పరిస్థితికి వచ్చింది, భక్తులు ప్రదక్షిణలు చేసుకునే అవకాశం కల్పించాలన్నభక్తుల కోరిక మేరకు గర్బగుడి చుట్టూ కాకుండా ఆలయం బయట మహాప్రాకార ప్రదక్షిణలకు అనుమతి ఇచ్చారు.
ఆలయం చుట్టూ ఒక్క మహాప్రాకార ప్రదక్షిణ చేస్తే 11 ప్రదక్షిణలకు సమానమని, 11 ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలకు సమానమని ఆయన భక్తులకు వివరించారు. కొవిడ్ ప్రభావం ఉన్నంత కాలం ఆలయ గర్బగుడి చుట్టు ప్రదక్షిణలకు అనుమతి ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నుంచి మహాప్రాకార ప్రదక్షిణలు చేయడం ప్రారంభించామని, భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చి మహాప్రాకార ప్రదక్షిణలు సంతోషంగా చేస్తున్నారని తెలిపారు.