మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చేపట్టిన గాలింపులో ఎట్టకేలకు నెక్నాంపూర్ ఇవివి కాలనీ సమీపంలోని చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైయింది.
ఏకధాటిగా కురుస్తున్న వర్షంలోనూ రెస్క్యూ బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహాన్ని గుర్తించి నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదృశ్యమైన రజనీకాంత్ కుటుంబ సభ్యులను నెక్నాంపూర్ చెరువు వద్దకు పిలిపించి మృతదేహాన్ని చూపించారు. అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రజనీకాంత్ గా కుటుంబసభ్యులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్ స్పెక్టర్ మదనం గంగాధర్ తెలిపారు.
రెండు రోజుల పాటు వర్షపు నీటిలోనే రజనీకాంత్ మృతదేహం ఉండటంతో చాలా వరకు కుల్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఒంటిపై బ్లూకలర్ షర్టుతో ఉన్న రజనీకాంత్ ఆనవాళ్లను కుటుంబసభ్యులు గుర్తించడంతో రజనీకాంత్ గా నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే..
కాగా అంతకు ముందు మురుగునీటి కాలువలో వ్యక్తి గల్లంతైన సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదం జరిగిన తీరుతెన్నులపై మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్ ముదిరాజ్, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మదనం గంగాధర్, మున్సిపల్ కమీషనర్ జయంత్, డీఈ సాజిద్లను అడిగి తెలుసుకున్నారు.
పనులు జరుగుతున్న చోట ప్రమాదపు హెచ్చరిక బోర్డులను అమర్చాల్సి ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదం చోటుచేసుకుని ఉండేదికాదన్నారు. అనంతరం నీటిలో గల్లంతైన వ్యక్తి వివరాలు, భాధిత కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. భాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని, గాలింపు చర్యలను మరింత వేగంగా చేపట్టాలని ఆయన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.