మాదాపూర్ : తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ శుక్రవారం చందానగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చందానగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాలకు హజరై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీల ఆశీస్సులను అందుకున్నారు. స్వరూపానందేంద్ర స్వామి వారు జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను గవర్నర్కు బహుకరించారు.
తమిళ సై నుదుటన కుంకుమ తిలకం దిద్ది రాజ శ్యామల అమ్మవారి రక్షారేఖను కట్టారు. ఈ సందర్భంగా తమిళ సై మాట్లాడుతూ … విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి వారి ఆశీస్సులను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. లోక కల్యాణం కొరకు ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమన్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రజలంతా బయటపడాలని స్వామీజీని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని ఆమె తెలిపారు. అనంతరం చెవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ గాంధీ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్లు స్వామి వారిని దర్శించుకొని స్వామిజీని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.