మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహిళలకు 17 కోట్ల రూపాయల చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీచైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కల్సి పంపిణీ చేసారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే రాష్ట్రంలో ఉన్న అన్ని మహిళా సంఘాల సభ్యులు తమ కాళ్లమీద తాము నిలబడి నిలదొక్కుకుంటున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 3200 మంది వ్యక్తిగతంగా చిన్న చిన్న షాపులను పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 570కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 290కోట్ల రుణాలను డ్వాక్రాసంఘాల వారికి ఇచ్చామని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 2700 స్వయం సహాయక గ్రూపులు నడుస్తున్నాయని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఆర్డీవో వెంకటాచారి, ఆర్పీజ్యోతి, ఎంపీడీవో నర్సింలు,సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ సర్సన్ సురసాని వరలక్ష్మి పాల్గొన్నారు.