బేగంపేట్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే స్ఫూర్తి దాయకమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పథకంలో ప్రభుత్వం మంజూరు చేసిన 29 ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్షా116 ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు. అంతే కాకుండా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అనుసరించేందుకు పలు రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలతా, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, ఉప్పల తరుణిలతో పాటు సికింద్రాబాద్ ఎమ్మార్వో బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు.