మణికొండ : నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపై తీవ్రమైన భు వివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మేరకు సస్పెండ్ చేశారు. నార్సింగ్ పీఎస్ పరిధిలోని పలు భూ వివాదంలో ఇన్స్పెక్టర్ గంగాధర్ తల దూర్చారు.
జన్వాడలోని ఓ భూమి విషయంలో కూడా ఆయన ప్రమేయం ఉండడంతో బాధితుడు రవీందర్ రెడ్డి సైబరాబాద్ సీపీకి నేరుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఆయన గంగాధర్తో పాటు ఎస్ఐ లక్ష్మణ్ను సస్పెండ్ చేశారు. గతేడాది ఫిబ్రవరిలో నార్సింగి ఇన్స్పెక్టర్గా భాధ్యతలు చేపట్టిన గంగాధర్ అనతికాలంలోనే ప్రజల నుంచి ఆదరణ పొందినప్పటికీ రెండు గ్రామాల మధ్య నెలకొన్న భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్కు గురైయ్యారు.
శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామపరిధిలోని సర్వేనెంబరు 68, కొల్లూరు గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 278లలో గ్రామాల మధ్య ఓవర్లాప్ భూ వివాదంలో కేసులు నమోదు చేసిన కారణంగా చర్యలు తీసుకున్నారని తెలిసింది. అప్పటి జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ ఆదేశాలనుసారంగానే తాము విధులు నిర్వహించామే తప్ప ఎలాంటి అవినీతి ఆరోపణల కు పాల్పడలేదని ఇన్స్పెక్టర్ గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్లు వివరణ ఇచ్చారు.
నూతన ఇన్స్పెక్టర్గా భాధ్యతలు చేపట్టిన శివకుమార్
నార్సింగి పోలీస్స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా వి.శివకుమార్ ఆదివారం సాయంత్రం భాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఇటీవల సైబారాబాద్ కమిషనరేట్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఇన్స్పెక్టర్గా వెయిటింగ్లో ఉన్న శివకుమార్ను నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా నియమిస్తూ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.