వెంగళరావునగర్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయారు. బుధవారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి పై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు పోసాని, ఆయన భార్యను తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఇంటి వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్లారెడ్డిగూడలో పోసానికి సొంత ఇల్లు ఉంది. అయితే గత 8 నెలల క్రతమే ఆయన మణికొండకు మారారు. ఖాళీగా ఉన్న ఇంటిని చూసుకునేందుకు యాకయ్య, శోభ అనే దంపతులను కాపలాదారులుగా ఉంచారు. ఈ క్రమంలో పోసాని ఇంట్లోనే ఉన్నాడని భావించిన అగంతకులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం కూడా గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వెళుతూ గట్టిగా దుర్భాషలాడుతూ వెళ్లారని వాచ్మెన్ తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు, తమను కొడతారనే భయంతో తాము బయటకు రాలేదని వాచ్మెన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడి సమాచారాన్ని పురుషోత్తం అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి వద్ద భద్రతను కల్పించారు. దర్యాప్తులో భాగంగా పోసాని ఇంటి సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాచ్మెన్ యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.