తెలుగుయూనివర్సిటీ : సృజనాత్మకత రచయిత వల్లకొండ గురుమూర్తి రచనలు నేటి తరం పిల్లల్లో పఠనాసక్తిని పెంచడంతో పాటు సందేశాన్ని, స్పూర్తిని కలిగిస్తాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ప్రశంసించారు. ఏసీగార్డ్లో గల రమణాచారి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్, రచయిత వల్లకొండ గురుమూర్తి(విశ్వశ్రీ) రచించిన మొలకలు కథా సంపుటి ఆవిష్కరణ సభ బుధవారం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి కథల సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ భోధనలో అధ్యాపకులుగా, విద్యా శాఖలో అధికారిగా పనిచేసిన గురుమూర్తి అనుభవంతో సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో సందేశాన్ని ఇచ్చేలా గొప్ప రచనలు చేశారన్నారు. నేటి తరానికి స్పూర్తిని అందించే గొప్ప కథల పుస్తకాలు గురుమూర్తి రచించి సాహితీ వఠవృక్షంగా ఎదగాలని ఆయన అకాంక్షించారు. రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు ఎం. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి తరంలో పుస్తక పఠనం తగ్గుతున్న తరుణంలో గురుమూర్తి కథల సంపుటి యువతలో పఠనాసక్తిని పెంచేల ఉందన్నారు.
ఆడిట్ శాఖ డిప్యూటీ డైరక్టర్ వి. శరత్చంద్ర మాట్లాడుతూ సుధీర్ఘ అనుభవ సారం పుస్తక రూపంలో వచ్చిందని పేర్కొ న్నారు. సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర మాట్లాడుతూ పుస్తకంలోని 33 కథలు 33 జిల్లాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సద్గురు శివానంద నృత్యమాల అకాడమీ వ్యవస్థాపకులు బి. సుధీర్రావు శిష్యురాలు కుమారి శిశిర కూచిపూడి నృత్యాభినయంతో, చక్కటి ఆహార్యంతో ఆహుతులను అలరించి ప్రశంసలు అందుకుంది.