చాదర్ఘాట్ : రాష్ట్రాన్ని మతతత్వ పార్టీల నుంచి కాపాడుకునేందుకు, ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సెప్టెంబర్ 8న ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తహరీక్ ముస్లిం షబ్బాన్ చైర్మన్ ముష్తాక్ మాలిక్ తెలిపారు.ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముష్తాక్ మాలిక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లౌకికవాదానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇటీవల చార్మినార్ వద్ద జరిగిన బీజేపీ పాదయాత్ర మొత్తం ముస్లింలను టార్గెట్ చేసే విధంగా ఉందని, ముస్లింలకు వ్యతిరేకంగా నినాధాలు చేశారని దుయ్యబట్టారు.
లౌకికవాదులను, మత పండితులను, రాజకీయేతర శక్తులందరిని ఏకం చేసి మతతత్వ పార్టీలను అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. వారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. మతతత్వ పార్టీల వైఖరిని నిరసిస్తూ 8న మధ్యాహ్నం రెండు గంటలకు చార్మినార్ నుంచి కులీకుతుబ్షా స్టేడియం వరకు ర్యాలీ నిర్వహిస్తామని, ఈ ర్యాలీలో హిందూ పూజారులు, క్రిస్టియన్ బిషప్, ముస్లిం మత పెద్దలు, స్కాలర్స్ పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశంలో ముజ్తబా, షకీల్, ఏం.ఏ.గఫార్ తదితరులు పాల్గొన్నారు.