ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్గా మూడేళ్లు విజయవంతంగా పనిచేసి, చైర్మెన్గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మారుమూల గ్రామం నుంచి వచ్చి ఉన్నత పదవులు అధిష్టించడం గొప్ప విషయమన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి. కుమార్, ప్రధాన కార్యదర్శి జుమ్లాల్, ప్రతినిధులు రామాంజనేయులు, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.