కొండాపూర్: తాను మరణిస్తూ మరో 5 మందికి ప్రాణదాతగా నిలిచిన కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ వీరబాబుకు నివాళిగా గురువారం బెటాలియన్ కమాండెంట్ పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఈ నెల 12 న వీరబాబు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవఖానలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళాడని, బ్రెయిన్డెడ్ అయిన ఆతని కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరబాబు అవయవాలను అత్యవసర పరిస్థితులలో ఉన్న మరో 5 మందికి అందజేసి ప్రాణాలు కాపాడారన్నారు.
మరణంలోను మరో 5 కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వీరబాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబర్చే వీరబాబు సేవలను కొనియాడారు. అనంతరం వీరబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ టీ గంగారం, అసిస్టెంట్ కమాండెంట్లు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.