రవీంద్రభారతి : సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్బాపూజీ అని ఆయనను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ 106వ జయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమానికి గౌరవ అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాసగౌడ్ విచ్చేశారు.
అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్బాపూజీ ఒక వ్యక్తికాదు శక్తిఅని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదు యావత్తు తెలంగాణ జాతికి సామాజిక ఉద్యమకారుడని, ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్పత్యాగశీలి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణకోసం తన సొంత ఇంటినే తెలంగాణ భవన్కు కేటాయించిన మహానీయుడని, ఆయన నిరంతరం తెలంగాణ గురించే తపనపడేవారనన్నారు.
సమాఖ్య పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన తెలంగాణ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసి తెలంగాణ వచ్చేవరకు తాను ఏ పదవిని చేపట్టని శపథం చేశారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కోసం దేశంవ్యాప్తంగా గొప్ప ఉద్యమాన్ని చేపట్టి చేనేత వృత్తిని కాపాడిన పోరాటయోధుడని అన్నారు. జలదృశ్యంలో కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాలలో ఆయన జీవిత చరిత్రను పొందపరిచి నేటి యువతకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతి ఎన్నటికీ మరువదు : గంగుల కమలాకర్
అనంతరం మంత్రి గంగుల కమలార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమనేత, సామాజిక ఉద్యమాకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతి ఎన్నటికి మరువదన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగిందన్నారు. సమాఖ్య పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన తను నమ్మిన సిద్దాంతం కోసం చివరి వరకు పోరాడిన గొప్పమహానీయుడని కొనియాడారు.
ఆనాటి పాలకులు ఆయన ఇంటిని కూడా ధ్వంసం చేసి ఎన్నో ఇబ్బందు లు కల్గించిన తెలంగాణ వచ్చేవరకు పోరాటం చేసిన త్యాగశీలి కొండాలక్ష్మణ్బాపూజీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు త్వరలోనే జలదృశ్యంలో ఆచార్య కొండాలక్ష్మణ్బాపూజీ విగ్రహాం ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పద్మశాలిల కోసం సిరిసిల్లలో చేనేత వృత్తిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, చేనేత కార్మికులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని చెప్పారు.
బాపూజీ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను : శ్రీనివాస్ గౌడ్
అనంతరం క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే నేను తెలంగాణ ఉద్యమం లో చురుకుగా పాల్లొన్ననన్నారు. నేటి యువత కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన ఒక కులానికి నాయకుడు కాదని తెలంగాణ జాతికే ఒక సామాజిక నాయకుడని కొనియాడారు. ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఆస్తులు, అంతస్తులు సర్వం త్యాగం చేసిన గొప్పనాయకుడు అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఉద్యమనేత, సిఎం కెసిఆర్ బిసిలు గౌరవంగా బతికేందుకు కులవృత్తులను ప్రోత్సాహించి వారికి అనేక సంక్షేమ పథకాలు అందించిన గొప్పనాయకుడు సిఎం కెసిఆర్ అని కొనియాడారు. దేశంలోనే ఎవ్వరూ చేయని విధంగా బీసీల అభ్యున్నతి కోసం ఆత్మగౌరవ భవనాలు, విద్యార్థులకు బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పి బీసీ పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారని అన్నారు. మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి , టిఆర్ఎస్ నేత ఎల్.రమణ, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు, మాజీ ఎంఎల్ఎ చింతా ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబురావు, గుండు సుధారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.