శంషాబాద్ : మూడు రోజులపాటు జరిగిన శంషాబాద్ శ్రీ వెండి కొండ సిద్దేశ్వరాయం (సిద్దులగుట్ట) రుద్రయాగం, జాతర మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. సిద్దేశ్వరాలయంలో మూడు రోజుల పాటు రుద్రయాగం, శ్రీ పార్వతీపరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం.. అగ్నిగుండాలు, అభిషేకాలు వేదపండితుల వేదమంత్రోఛ్ఛారణలు, భాజభజంత్రీలు, మంగళవాయిద్యాలు…భక్తుల పంచాక్షరీ జపాల మధ్య కన్నుల పండుగగా సాగాయి.
తెల్లవారు జామున అగ్నిగుండాలలో భక్తులు నడిచి భక్తితన్మయత్వంతో తరించారు.అనంతరం మహాన్యాస రుద్రయాగం, రుద్రాభిషేకం, అమృతస్నానం, అన్నపూజ, అమ్మవారికి కుంకుమార్చనలు,ఆకుల పూజ నిర్వహించారు.ఉత్సవాల చివరిరోజు మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.మూడు రోజుల పాటు రుద్రయాగం, జాతర మహోత్సవాలలో భాగంగా వైభవంగా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి.
నగరంతో పాటు పలు ప్రాంతాల భక్తులు తరలివచ్చి సిద్దేశ్వరుని దర్శించుకున్నారు. దేవాదాయశాఖ, శంషాబాద్ మున్సిపల్, ఉత్సవ కార్యనిర్వహక వర్గం సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసుశాఖ ముందుజాగ్రత్తగా భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టింది. జాతర ప్రశాంతంగా ముగియడంతో సర్వత్రాహర్షం వ్యక్తం అవుతుంది.