బంజారాహిల్స్ : టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్నగర్ డివిజన్లో టీఆర్ఎస్ నూతన కమిటీలను సోమవారం ఎన్నుకున్నారు. శ్రీరాంనగర్లోని లక్కీ ఫంక్షన్ హాల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో కొత్త కమిటీలను ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా ఎండీ.మన్సూర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.భాస్కర్, కోశాధికారిగా ఫయాజ్లను ఎన్నుకున్నారు. వీరితో పాటు పలు విభాగాలకు కమిటీలను ఎన్నుకున్నారు.
మహిళా విభాగం అధ్యక్షురాలిగా ధనుజ,ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నందూనాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రవిశంకర్, యూత్ విభాగం అధ్యక్షుడిగా విలియమ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అహ్మద్, సోషల్మీడయా విభాగం అధ్యక్షుడిగా ఎస్.బసప్ప ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీ నేతలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కొత్త కమిటీలు పనిచేయాలని సూచించారు.
తాను నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని, ఇదే విధంగా క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని, సీనియర్ నాయకులకు నియోజకవర్గం, జిల్లా కమిటీల్లో చోటు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.