బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపాలిటీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ ఆర్ జ్ఞానేశ్వర్, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.7.65 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆమె అన్నారు.
శ్రీశైలం హైవే నుంచి వివేకానంద విగ్రహాం, సర్ధార్ నగర్ వరకు రూ.2.23 కోట్లు బీటీ రోడ్డు, రావిర్యాల నుంచి సీపీడీసీ మీదగా ఆర్ సీఐ వరకు రూ.4 కోట్ల ప్రత్యేక నిధులతో బీటీ సీసీ రోడ్డు పనులు చేయనున్నట్లు ఆమె తెలిపారు. మాంఖాల్ గుడి నుంచి ఓ ఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వరకు రూ.50లక్షలతో బీటీ రోడ్డు, శ్రీశైలం హైవే నుంచి సూరారం చెరువు అలుగు నిర్మాణానికి, సీసీ రోడ్డు కు రూ.90లక్షలు కెటాయించడం జరిగిందన్నారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు కాలనీలలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. దశల వారిగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామన్నారు.