రవింధ్రభారతి : రాష్ట్రంలో గౌడ, ఎస్సీ,ఎస్టీ కులస్థులకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. శుక్రవారం రవింధ్రభారతిలో కులసంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలను సమన్యాయం చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వైన్షాపుల్లో 30 శాతం రిజర్వేషన్ల కల్పనకు నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు.
గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం , ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఆయా కులాల్లో ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని,యువతకు ఉపాధి దొరుకుతుందని ఆయన అభ్రిపాయపడ్డారు. సమాఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా నష్టపోయిన కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఆంధ్రపాలకుల పాలనలో మూతపడ్డ కల్లు దుకాణాలు తెరిపించి, హైదరాబాద్లోని ట్యాంక్బండ్ సమీపంలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కల్లుకు తగిన ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు.
ప్రమాదంలో మరణించిన ప్రతి గీత కార్మికునికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా సీఎం కేసీఆర్ ఘనతేనన్నారు. గౌడకులస్థులు ఆత్మగౌరవంగా బతుకాలనే మంచి ఉద్దేశంతో కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి ఆత్మగౌరవ భవనం కట్టిస్తామని చెప్పడమే కాకుండా వచ్చేనెలలో శంకుస్థాపన కూడా చేయనున్నారని మంత్రి చెప్పారు. ఈ నెల 22 హుజూరాబాద్లో గౌడగర్జన కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి గౌడకులస్థులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.
అలాగే హుజూరాబాద్ నియోజకవర్గ గౌడకులస్థులకు ఒక ఎకరం భూమిలో కోటి రూపాలయతో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మాస్తారని పేర్కొన్నారు. దేశంలోనే ఏరాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్న సిఎం కేసీఆర్కు అండగా ఉండాలన్నారు.
ఆత్మయసమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, సీనియర్ శాసనసభ్యుడు ప్రకాష్గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్గౌడ్, ప్రభుత్వ విద్యామౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్ నాగేందర్గౌడ్ ,గౌడ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, బాలగోని బాలరాజుగౌడ్, మాజీ చైర్మన్ రాజేశంగౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, పత్రాని రామకృష్ణ, విజయభాస్కర్గౌడ్ , ఐలి వెంకన్నగౌడ్,వేములయ్యగౌడ్, ఎలికట్టి విజయకుమార్గౌడ్, యూనివర్సీటీ నాయకులు రవికుమార్గౌడ్, ఎస్సీ నాయకులు చందు, జంబులయ్య, ఎస్టీ నాయకులు కిషన్నాయక్ వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.