కవాడిగూడ : పటాన్ బస్తీలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ట్రాన్స్ఫార్మన్ అక్కడ నుంచి తీసివేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన సూచించారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్లోని పటాన్బస్తీలో మహదివియా ట్రస్ట్ బోర్డు సభ్యుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ శాఖా ఏడీఈ పాపయ్య, ఏఈ సైదులుతో కలిసి ప్రమాదంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఉచిత వైద్యశాల హజరత్ సయ్యద్ యూసఫ్ మెమోరియల్ క్లినిక్కు ప్రతి రోజు వందలాది మంది వస్తారని, విద్యుత్ ట్రాన్స్ఫార్మన్ దవాఖాన ప్రాంగణంలోనే ఉండడంతో ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దవాఖాన ప్రాంగణం నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.