కొడంగల్లో ఘనంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
కొడంగల్, మార్చి 18 : కొడంగల్ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామివారు ఆదిత్యుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంలో ఊరేగారు.శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి స్వర్ణోత్సవం, ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 9 రోజులుగా బ్రహ్మాండనాయకుడికి కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు తీరొక్క అలంకరణతో, వివిధ వాహనాలపై కొలువుదీరి పూజలు అందుకున్నారు. గురువారం శ్రీనివాసుడిని ఆలయ అర్చకులు సూర్యనారాయణ మూర్తి అవతారంలో అలంకరించి సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తులు స్వామివారికి మంగళహారతులను ఇచ్చి దర్శించుకున్నారు. శ్రీదేవి, భూదేవి సమితుడైన శ్రీనివాసుడి ఉత్సవ మూర్తులను అభిషేకించారు. ఊంజల్ మంటపంలో స్వామివారికి ఉయ్యాలసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘బాలాజీ ఆడుతా పాడుతా తియ్యగా’ సంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిన్నారులు భక్తి కీర్తనలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.