చాదర్ఘాట్ :మలక్పేటలోని ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాల ప్రారంభానికి సిద్ధమయ్యింది. రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రుల చేత ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మలక్పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్ వెనుక వైపు ఉన్న ప్రాథమిక పశువైద్య కేంద్రంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టారు.
1986లోనే ఇక్కడ పశువైద్య కేంద్రం ఏర్పాటు చేయగా అది పూర్తిగా శిథిలమైంది. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ నూతన పశువైద్యశాలను నిర్మించింది. ప్రతి నెల 50-60 వరకు జంతువులకు చికిత్స చేయించేందుకు వాటి యజమానులు మలక్పేటలోని పశువైద్య కేంద్రానికి తీసుకొస్తుంటారు.
మేకలు, గొర్రెలు, కుక్కలు, మార్జాలాలు, గుర్రాలు, ఆవులు ఇలా పలు జంతువులకు ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యం చికిత్స అందిస్తుందని పశువైద్యాధికారిని డాక్టర్ ప్రతిభ తెలిపారు. గతంలో ఉన్న బిల్డింగ్ పూర్తిగా శిధిలావస్థకు చేరుకోవడంతో కొన్ని నెలల క్రితం కూల్చివేసి. నూతన భవనాన్ని నిర్మించి అందబాటులోకి తీసుకొచ్చారన్నారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఎమ్మెల్సీ సీడీపీ నిధుల ద్వారా రూ.40 లక్షలు నిధులు కేటాయించడంతో భవనం పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో ఈ పశువైద్యకేంద్రాన్నిరాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.