ముషీరాబాద్ : తాను గౌరప్రదమైన వృత్తిలో ఉన్నాననే విషయాన్ని మరిచి విద్యార్థినీల ఫోటోలు తీస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ కీచక టీచర్ను తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తెలుసుకొని తగిన బుద్దిచెప్పుదామని పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు సదరు టీచర్ వికలాంగుడని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు.
చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, విద్యార్థినీల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. దోమలగూడ గగన్మహల్ ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకునిగా పని చేస్తున్న శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తమ ఫోన్లో ఫోటోలు చూపిస్తూ, విద్యార్థినీలు, తోటి అధ్యాపకుల ఫోటోలు తీస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్లు వినాలంటూ విద్యార్థినీలను వేధింపులకు గురిచేస్తున్నాడు.
అధ్యాపకుడు శ్రీనివాస్ చేష్టలకు విసుకుచెందిన పలువురు చిన్నారులు తాము స్కూల్కు వెళ్లమని ఇంట్లోనే ఉంటామంటూ ఏడుస్తూ తల్లిదండ్రులకు జరుగుతున్న విషయాలను వివరించారు. దీంతో సోమవారం పలువురు విద్యార్థినీల తల్లిదండ్రులు టీచర్కు బుద్దిచెప్పుదామని పాఠశాలకు వెళ్లారు. తీరా అధ్యాపకుడు శ్రీనివాస్ వికలాంగుడని తెలిసి ఏమనకుండా అతని వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరోవైపు పాఠశాలకు చెందిన తోటి మహిళా టీచర్లను సైతం వేధిస్తుంటాడని పలువురు చెప్తున్నారు. గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అతనిలో మార్పు రాలేదని పలువురు అధ్యాపకులు చెప్తున్నారు. మరోవైపు సదరు అధ్యాపకుడు తాను ఎవరి ఫోటోలు తీయలేదని, అసభ్యకరంగా ప్రవర్తించలేదని చెప్తున్నాడు.