ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ 81వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేడుక ఈనెల 27న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 9.30 లకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మెన్, కేంద్ర రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ జి. సతీశ్రెడ్డి హాజరుకానున్నారు.
ఈ వేడుకల్లో 2018-2019, 2019-2020 విద్యాసంవత్సరాలకు సంబంధించిన స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఈ వేడుకలలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
గుర్తింపు కార్డులు తప్పనిసరి
స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు ఈ నెల 23, 24 తేదీలలో ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించి గుర్తింపుకార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరూ విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సాంప్రదాయం ప్రకారం అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చకోవాలని తెలిపారు.
350 పీహెచ్డీ పట్టాల ప్రదానం
స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్డీలలో స్వర్ణ పతకాలు సాధించిన 82 మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు 350 పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో స్వర్ణ పతకాలు సాధించిన 22 మందికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.