సుల్తాన్బజార్ :1908లో వచ్చిన భారీవరదలలో 150 మంది ప్రాణాలను కాపాడిన చింతచెట్టును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉస్మానియాదవాఖాన ఆవరణలోని అఫ్జల్పార్క్లో ఉన్న చింతచెట్టువద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1908 వరదల అనంతరం నాటి ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టణ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మూసీ వరదలతో ప్రాణ నష్టం జరగవద్దని నూతనంగా జంట జలాశయాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన కమిటీలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మీర్ ఆజం అలీలను నియమించారన్నారు. వారి పర్యవేక్షణలో 1923 నాటికి జంట జలాశయాలు నిర్మితమై అందుబాటులోకి వచ్చాయన్నారు.
దేశ స్వాతంత్య్రం అనంతరం పాలకులు పట్టించుకోక పోవడంతో మూసీ వరదలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లు ప్రత్యేక దృష్టిసారించి మూసీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు గాను 1000 ఎంఎల్టీ సామర్థ్యం ఉన్న 31 ఎస్టీపీలను నిర్మించేందుకు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమన్నారు.
నాటి మూసీ నదిని కళ్లకు కట్టినట్లు ప్రతి నెలా షామ్ ఎ మూసీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిక్ సమాజ్ చైర్మన్ సజ్జన్సింగ్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ రమేష్కుమార్, అన్వర్ ఉలూం కళాశాల సెక్రటరి మహబూబ్ ఆలం ఖాన్, ఆర్కిటెక్చర్ నారాయణ మూర్తి, ప్రొఫెసర్ ధనుంజయ్, వేణుగోపాల్, నవాబ్ ఫరీద్, ఫర్హీన్, వినోద్ బూరాలాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.