అమీర్పేట్ : ఈ నెల 17న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఉదయం 10.30 గంటలకు దసరా సమ్మేళనంగా ‘దత్తన్న.. అలయ్ బలయ్’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన విషయాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి, మాజీఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
భారతీయ సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా రాజకీయాలకు అతీతంగా బీజేపీ అగ్రనాయకులు బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్న అలయ్ బలయ్కు విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ నెల 17న జరుగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిధులుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద విశ్వనాథ్ అర్లెకర్, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి జి.కిషన్రెడ్డిలు విచ్చేస్తారని తెలిపారు.
వీరితో పాటు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి తీగుళ్ళ పద్మారావుగౌడ్, మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్ ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, వి.శ్రీనివాసగౌడ్తో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఎం.పీ, ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యే, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు.