కురవి వీరభద్రుడికి ప్రత్యేక పూజలు
సందడిగా దోపోత్సవం
108 కలశాల నీటితో పూర్ణాభిషేకం
కురవి, మార్చి18 : భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు గురువారం స్వామివారికి దోపోత్సవం, వంసతోత్సవం, త్రిశూలస్నానం నిర్వహించారు. తాను కోరిన కోర్కెను తీర్చలేదని అమ్మవారు స్వామివారిపై అలుగుతుంది. ఆ అలకను తీర్చడానికి దోపోత్సవం(దొంగ దోపు) నిర్వహిస్తారు. కురవి శివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్థాపిత కలశాలతో స్నపనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 కలశాల నీటితో స్వామివారికి పూర్ణాభిషేకం చేశారు. వీరభద్రుడి ఆయు ధం త్రిశూలంతో కురవి పెద్ద చెరువు వద్ద నిర్వహించిన త్రిశూలస్నానం నేత్రపర్వంగా జరిగింది. సర్వపాపాలను త్రిశూలస్నానం హరిస్తుందని పండితులు వివరించారు. అనంతరం భక్తులు స్నానాలు ఆచరించారు. స్వామివారి చందనాభిషేకం నీటితో వసంతోత్సవం కార్యక్రమం జరిగింది. పూర్ణాభిషేకంలో సుగంధ ద్రవ్యాలు, చందనం, పసుపుతో మిళితమైన నీటితో స్వామివారిని అభిషేకించారు. అనంతరం పురవీధుల గుండా స్వామివారు శావపై ఊరేగారు. భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ బాదావత్ రామూనాయక్, కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, మాజీ చైర్మన్ రాజూనాయక్ దంపతులు, సమ్మ య్య పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న ఆధ్వర్యంలో వేదపండితులు శివకిరణ్, రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్, శ్రీకర్, విజయ్, పుణ్యమూర్తి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.