నాటి కష్టాలు తీర్చిన ‘పల్లె ప్రగతి’
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనం
ప్రజాప్రతినిధుల కృషికి ఫలితం
సరికొత్తగా పంచాయతీ భవనం
నెల్లికుదురు, మార్చి 16:ఒకప్పుడు చిన్నపాటి వర్షానికే ఇక్కడి వీధులు బురదమయమయ్యేవి. చెత్తాచెదారం, మురుగునీటితో డ్రైనేజీలు కంపుకొట్టేవి. రోడ్లు, వీధి దీపాలు, పంట పొలాలకు బాటలు, అంతిమ క్రియలకు సౌకర్యాలు లేక గ్రామస్తులకు ఇబ్బందులు తప్పకపోయేవి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఇప్పుడా ఊరి రూపురేఖలే మారిపోయాయి. అద్దంలా మెరిసే సీసీరోడ్లు, ఎటుచూసినా పచ్చదనం, మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు, మెరుగైన పారిశుధ్య వ్యవస్థతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి బ్రహ్మాండంగా తయారైంది.
ఊరికే అందం.. ప్రకృతి వనం
ఇక్కడి పల్లె ప్రకృతి వనం.. ఊరికే కొత్తదనం తీసుకొచ్చింది. గ్రామ శివారులో 1.10ఎకరంలో 2,450 మొక్కలు నాటడంతో చిట్టడువులను తలపిస్తున్నాయి. అంతేగాక మార్నింగ్ వాక్ చేసేందుకు అనువుగా కాలిబాటలు వేశారు. సాయంత్రం వేళ వచ్చే చిన్నా, పెద్దలకు ఆహ్లాదం పంచుతోంది. గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనందుకు ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల నజరానాతో 40 ఏళ్ల నాటి 430 మీటర్ల రోడ్డు మరమ్మతులకు నోచుకుంది. వీటితో పాటు పల్లె ప్రగతి ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో బ్రాహ్మణ కొత్తపల్లి స్వరూపమే మారిపోయింది. రూ.11.5 లక్షలతో రెండెకరాల స్థలంలో శ్మశానవాటిక, రూ.2.20 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షలతో నర్సరీ పనులు పూర్తయ్యాయి. రూ.10 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు. గ్రామంలోని ఐదు ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ కోసం రూ.4లక్షలు వెచ్చించి చీకటి బాధలు తీర్చారు. గ్రామ పంచాయతీ భవనం కోసం ప్రభుత్వం రూ.16లక్షలు కేటాయించగా మరో రూ.16లక్షలు కలిపి అత్యాధునిక హంగులతో తీర్చిద్దుతున్నారు. వార్డు సభ్యులు, జీపీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కుర్చీలు వేయించగా పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇటు ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు దాతల సహకారం కూడా తీసుకుంటూ అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. గ్రామానికి చెందిన రుద్రారపు మహేశ్ సుమారు రూ.2 లక్షల ఆర్థిక సహాయంతో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు. తాళ్ల రాంరెడ్డి సౌజన్యంతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు.
ప్రత్యేక విజన్తో బాగుచేసుకుంటున్నం..
గ్రామంలో తోటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విజన్తో ఊరిని బాగుచేసుకుంటున్నం. పల్లె ప్రగతి ఊరికి కొత్తదారి చూపింది. ఏ అభివృద్ధి పని మొదలుపెట్టినా అందరూ సహకరిస్తున్నారు. మా టీమ్లో అంతా యువకులే కావడం వల్ల మేం అనుకున్నట్లు గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నాం. గ్రామంలో 95శాతం సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు సీసీ రోడ్డు లేని వీధి లేదు.
అన్ని సౌకర్యాలున్నయ్..
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రామంలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నం. పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు, నర్సరీల పూర్తయ్యాయి. డంపింగ్యార్డు వినియోగంలోకి వచ్చింది. చెత్త సేకరణ జరుగుతోంది. ఏ ప్రభుత్వం చేయని పని తెలంగాణ సర్కారు చేస్తున్నది. పారిశుధ్య పనులతో పల్లె స్వచ్ఛంగా మారింది.
చిట్టడవులను తలపిస్తున్నయ్..
పల్లెల్లో ఆహ్లాదం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. మా ఊరిలోని పార్కు నిజంగా ఓ చిన్న అడవిలా అనిపిస్తుంది. అందులో మార్నింగ్ జాగింగ్ చేస్తుంటే ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. అందుకే ప్రజలు కోరుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాం. పల్లె ప్రగతితో బ్రాహ్మణ కొత్తపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది.