బంజారాహిల్స్ : అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందంటూ స్నేహితుడి పేరుతో ఫేస్బుక్ మెసెంజర్లో వచ్చిన సందేశాన్ని నమ్మి రూ.40వేలు పంపించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న పూసపాటి లక్ష్మీపతిరాజు అనే వ్యాపారికి గత నెల 24న ఫేస్ బుక్ మెసేంజర్లో స్నేహితుడు విష్ణువర్దన్ పేరుతో సందేశం వచ్చింది. తనకు అర్జెంట్గా రూ.20వేలు కావా లని. వెంటనే ఫోన్పే ద్వారా తాను సూచించిన నెంబర్కు పంపించాలని కోరాడు. దాంతో అతడు చెప్పిన విధంగా లలిత్ కుమార్ అనే వ్యక్తిపేరుతో ఉన్న ఫోన్ నెంబర్కు పంపించాడు.
కాసేపటికి డబ్బులు రాలేదని, మరోసారి పంపించాలని కోరగా మరో రూ.20వేలు పంపించాడు. అవి కూడా రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా విష్ణువర్దన్ పేరుతో ఫేస్బుక్లో బోగస్ అకౌంట్ క్రియేట్ చేసినట్లు తేలింది. ఈ మేరకు బాధితుడు మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.