హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాల కార్మికులు, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, మానవ అక్రమ రవాణాకు గురైన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు నెల రోజులపాటు అధికారులు ఆపరేషన్ ముస్కాన్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టనున్నారు. ఏటా రెండు పర్యాయాలు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్-8ను నిర్వహించనున్నారు. ఈ స్పెషల్డ్రైవ్ పోస్టర్లను మంగళవారం లక్డీకాపూల్లోని మహిళా భద్రత విభాగం కార్యాలయంలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి తదితరులు ఆవిష్కరించారు.
అనంతరం ఆన్లైన్ కాన్ఫరెన్స్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి డీ దివ్య, కార్మికశాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్, చైల్డ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, లీగల్ సర్వీస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి రాధికజైశ్వాల్ సహా మొత్తం 785 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ.. నెల రోజులపాటు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్-8లో పోలీస్ సహా అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు.