బిడ్డకు జన్మనివ్వాలంటే.. ఆ మాతృమూర్తికి అది పునర్జన్మే! ప్రైవేటు వైద్యశాలల్లో కాసులు కురిపించనిదే కాన్పులు కష్టమయ్యే పరిస్థితుల నుంచి నేడు సర్కారు దవాఖానల్లో సుఖప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి పంపిస్తున్న రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. వైద్య నిపుణులను అందుబాటులో ఉంచడంతో పాటు అధునాతన వైద్య పరికరాలు సమకూరుస్తూ కార్పొరేట్ స్థాయి సేవలందిస్తున్నారు. వీటికి తోడు కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టి బాలింతలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్న కేసీఆర్ను తల్లులందరూ నిండు మనస్సుతో దీవిస్తున్నారు. ఆయన దేశానికీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు.
పేదవాడైనా.. శ్రీమంతుడైనా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ధనవంతులు వైద్యం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. కానీ, పేదకుటుంబాలకు సర్కారు దవాఖానలే దిక్కు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానకు పోవాలంటే భయపడిన జనాలు.. నేడు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ క్యూ కడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా, జిల్లా దవాఖాలను పూర్తిగా ఆధునీకరించారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రతిఒక్కరూ దీవిస్తున్నారు. ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దేందుకు ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ కిట్టు లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇవాళ ప్రభుత్వ దవాఖానలు ఎంతో మంచిగా అయ్యాయి. ఎనిమిదేండ్లలోనే దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో దేశానికే మోడల్గా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో దేశంలోనే అన్ని రాష్ర్టాలు కూడా ఇదే తరహాలో అవుతాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాలపై చిన్న చూపు చూస్తున్నది. దేశం బాగుపడాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని అన్నివర్గాల ప్రజలు కోరుతున్నారు. తల్లీబిడ్డల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా చేయని విధంగా సీఎం కేసీఆర్ గర్భిణుల కోసం ‘అమ్మఒడి’ కేసీఆర్ కిట్టు పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో సకల హంగులు కల్పించడంతో గర్భిణులు ప్రభు త్వ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతున్నారు.
ప్రైవేట్ దవాఖానకు వెళితే వేలకు వేల రూపాయలు గుంజడమే కాక ఆరోగ్యం కూడా పాడవుతుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచే లక్ష్యంగా 2017 జూన్ 2న కేసీఆర్ కిట్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కిట్టులో 13 రకాల వస్తువులు ఉన్నాయి. కిట్టుతోపాటు పాప పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలను ప్రభుత్వం అందిస్తున్నది. తల్లీబిడ్డలను 102 వాహనం ద్వారా దవాఖాన నుంచి ఇంటికి చేర్చుతుంది. జిల్లాలో ఉన్న దవాఖానల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్థాయి లో తీర్చిదిద్దారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని డయాలసిస్ కేంద్రం ద్వారా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. అన్ని సబ్సెంటర్లలోని ఏఎన్ఎంలకు ట్యాబ్లు అందజేసి ఆన్లైన్ ద్వారా మాతా శిశురక్షణ వివరాలు పొందుపర్చుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సర్కారు వైద్యమంటే సబ్బండవర్గాల సంక్షేమ వైద్యంగా ఈ ప్రభుత్వం చాటి చెప్పింది. నాడు ప్రభుత్వ దవాఖానలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, నేడు ఎంతటి పెద్ద రోగానికైనా ఇక్కడే చికిత్స అందించేలా వసతులను ఏర్పాటు చేశారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలలు వచ్చాయి. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. తొలి విడతలోనే జిల్లా ఏర్పాటు కాగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైంది. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నది. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. ప్రతిఒక్కరి ఆరోగ్యానికి భరోసానిస్తున్నది. జిల్లాలో డయాలసిస్ పేషంట్లకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ సీఎం కేసీఆర్ రూ.2016 చొప్పున పింఛన్ అందించనున్నారు.
సీఎం కేసీఆర్తోనే నేడు సర్కార్ దవాఖానాల్లో సరైన వైద్య అందుతుంది. గర్భిణులు ప్రైవేట్ దవాఖాలకు వెళ్తే సూమారు రూ.80వేలు పైగా ఖర్చు అవుతుంది. నయా పైసా ఖర్చు లేకుండా సర్కారు దవాఖానల్లో డెలవరీ చేస్తున్నారు. గర్భిణులకు కేసీఆర్ కిట్టును అందజేసి, వారి గ్రామాలకు 102 వాహనంలో ఇంటికి తీసుకెళ్తున్నారు. దూర దృష్టి ఉన్న మహా నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని అన్నివర్గాల మహిళలు, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రధాని మోదీ మాత్రం దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా మత రాజకీయాలను నడుపుతూ సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు. దేశం విద్య, వైద్యంలో ముందు ఉండాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఉండాలి.
-మద్దెల మల్లిక, మాతృ మూర్తి, మిరుదొడ్డి
మాది వెల్దుర్తి గ్రామం. ప్రభుత్వ దవాఖానలో వైద్యసేవలన్నీ కార్పొరేట్ స్థాయిలో ఉండడంతో గజ్వేల్ దవాఖానలో ప్రసవానికి వచ్చాను. ఆడపిల్ల పుట్టింది. సీఎం కేసీఆర్ కిట్టు ఇచ్చారు. పాపకు అవసరమైన అన్ని వస్తువులు ఉన్నాయి. మార్కెట్లో కొనాలంటే రూ.2 వేలకు పైనే ఉంటాయి. సీఎం కేసీఆర్ మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దవాఖానలను తీర్చిదిద్దారు. పుట్టిన పిల్లల గురించి కూడా ఆలోచించడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్తున్నారంటే ఇక దేశం మొత్తం ఇలాం టి సదుపాయాలు అన్ని దవాఖానాల్లో ఉంటాయన్న మాట.
-శ్రీలత, వెల్దుర్తి
ప్రభుత్వ దవాఖానల్లో బాగా చూస్తున్నారంటే గజ్వేల్ దవాఖానలో ప్రసవవానికి మా వాళ్లు తీసుకువచ్చారు. ఇక్కడ చాలా పరిశుభ్రంగా, ప్రత్యేకంగా గదులను నిర్వహిస్తున్నారు. తల్లుల వార్డులో అన్ని సేవలు బాగా అందుతున్నాయి. ఉచిత ప్రసవాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ దవాఖానలో వైద్యసేవలకు రూ.30వేల వరకు ఖర్చు అవుతుండే. ఇప్పుడు ఎలాంటి డబ్బులు ఖర్చు కాకపోవడంతో పాటు కేసీఆర్ కిట్టును ఉచితంగానే ఇచ్చారు. సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ బాగుండాలి.
ప్రభుత్వ దవాఖానల్లో పసిపిల్లలకు అవసరమైన అన్ని సేవలు అం దుబాటులో ఉన్నాయి. అలాగే, పిల్లలకు అవసరమైన డైపర్లు, నూనె, పౌడర్ లాంటి వస్తువుల కోసం బయట దుకాణానికి వెళ్లకుండా ప్రభుత్వమే కేసీఆర్ కిట్టు ద్వారా అం దించడం చాలా సంతోషంగా ఉన్న ది. ఇలాంటి సేవలు దేశవ్యాప్తంగా అందరికీ అందాలి. సీఎం కేసీఆర్ తల్లులు, పిల్లల ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
ఆర్థికంగా లేనోళ్ల పిల్లలకు కేసీఆర్ కిట్టు ఉపయోగపడుతున్నది. హనుమకొండ మిషన్ దవాఖానలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్టు ఇచ్చిండ్రు. ఉన్నోళ్ల పిల్లల్లు ఉపయోగించే ఈ కిట్టును మాలాంటి పేదోళ్ల పిల్లలకు ఇవ్వడం చాన మంచిది. చిన్న పాపకు దోమలు కుట్టకుండా దోమతెర కూడా ఇచ్చిన సర్కారును ఇప్పటి వరకు సూడలేదు. నాకు రెండుమార్లు కేసీఆర్ కిట్టు ఇచ్చిండ్రు. ఎవ్వలు కూడా రూపాయి తీసుకోలేదు. ఇట్లాంటి సౌకర్యం ఏ ప్రభుత్వం చేయలేదు. పేదోళ్లను సీఎం కేసీఆర్ ప్రభుత్వం మంచిగా చూస్తున్నది.
-రాచర్ల సోని, హుస్నాబాద్ పట్టణం