దేశ రాజకీయాలకు సీఎం కేసీఆర్ సరైనోడని, దేశానికి ఆయన ఆశాకిరణమని, ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిందేనని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రగతి ఆయనతోనే సాధ్యమని, కేసీఆర్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని, దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం భారతావనిలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని, శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలన్నా, మూలమూలనా సంక్షేమ ఫలాలు అందాలన్నా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ముక్తకంఠంతో ఆకాంక్షిస్తున్నారు. జాతీయ ప్రతిష్ఠ ప్రపంచ దేశాల్లో మార్మోగాలంటే కేసీఆర్ ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని క్రీడాకారులు సహా వివిధ వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జాతీయ పార్టీ పెట్టాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే ఇతర రాష్ర్టాల్లో కూడా క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన వారంతా సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వారివారి రాష్ర్టాల్లో అమలు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఎకరం స్థలంలో ఓపెన్ జిమ్లు, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, క్రీడా ప్రాంగణాలు నిర్మించి, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది. మండల కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియాలను ఏర్పాటు చేసింది. క్రీడల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించింది. ఇలా అన్ని క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో ఇవాళ క్రీడా రంగంలో ఎంతో మంది యువకులు రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే నిరుద్యోగ యువతకు కొలువుల జాతర మొదలైంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా దాదాపుగా 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, మాటకు కట్టుబడి ఆ రకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి. నిరుపేద యువత కోసం జిల్లా కేంద్రాలతో పాటుగా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించడంతో ఎంతో మంది నిరుద్యోగ యువత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలను సాధిస్తున్నారు. దేశంలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదు. సీఎం కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం రూపురేఖలు మారుతాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు.. అలాంటి గొప్పవ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాలి. విజన్ ఉన్న నాయకుడితో దేశంలో తప్పకుండా మార్పు వస్తుంది. అపార అనుభవమున్న మన సీఎంతోనే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి చాలా అవసరం. ఇప్పటికే కేసీఆర్ రాష్ట్రంలో సబ్బండవర్గాలకు అండగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అనతి కాలంలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో దేశ ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు.
– జుబేర్, మెదక్ జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ సార్కు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల అభివృద్ధికి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది దళితుల జీవితాలలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. తాజాగా గిరిజనుల కోసం గిరిజన బంధు ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం. రాష్ట్రంలో అన్నివర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో చక్రం తిప్పే సమయం వచ్చింది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని మావంటి క్రీడాకారులతో పాటు దేశ ప్రజలు ఎదురు చేస్తున్నారు.
– నాయిని లక్ష్మణ్, క్రికెట్ స్పోర్ట్స్ పర్సన్ నిజాంపేట
కేంద్రంలో ఆధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా విఫలమైంది. ఎక్కడకూడా సంక్షేమ పథకాలు అమలుచేయక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కేంద్రప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ సామాన్యప్రజల బతుకులను ఆగం చేస్తుంది. దేశంలో ఏరాష్ట్రంలోలేని అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్లాంటి గొప్పనాయకుడు జాతీయపార్టీ పెట్టి అధికారం సాధిస్తేనే దేశప్రజలకు మేలుజరుగుతుంది.
– ఎండీ ఆసిఫ్, క్రికెట్ క్రీడాకారుడు, హత్నూర
కేంద్రంలోని బీజేపీ పాలకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆ పార్టీ పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. బీజేపీ పాలనలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. స్వతహాగా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ వంటి రాష్ర్టాలను చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలి.
– విశ్వంభర స్వామి, వైస్ ఎంపీపీ చిలిపిచెడ్
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ, భద్రతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రంలో షీ టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు, వీ హబ్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుంది.
– పరశురాంగౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, మునిపల్లి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. అన్ని రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు సైతం తెలంగాణ పథకాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే దేశానికే మంచి గుర్తింపు వస్తుంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది.
– మౌలానా, మైనార్టీ శాఖ అధ్యక్షుడు, మునిపల్లి
తెలంగాణలో ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నది. ప్రజల సంక్షేమమే తన లక్ష్యంగా నిత్యశ్రామికుడిలా సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వం వివిధ రకాలుగా తెలంగాణ ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నది. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ప్రజల నుంచి వందశాతం మెప్పుపొందిన ఒకే ఒక నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన ప్రధాని అయితే రాష్ట్రంలో మాదిరిగా దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేసి దేశ ప్రజల మెప్పు పొందుతాడు.
– పప్పుల లహరి, ఎంపీటీసీ నిజాంపేట
భావితరాల కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. విజన్ ఉన్న నాయకుడైన కేసీఆర్ ఏడేండ్ల కాలంలో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపాడు. జాతీయ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదు. ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీతో ప్రజలు విసుగెత్తిపోయారు. కేంద్రం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడుతుంది. అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతుంది. ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ మాకు నాయకుడు కావాలని ఆతృతతో చూస్తున్నారు.
– ఉదయ వేమారెడ్డి, ఎంపీటీసీ, అంసాన్పల్లి
రైతురాజ్యం రావాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రసాధనకు ఉద్యమాలు, ఆమరణనిరాహార దీక్ష చేసి అందరినీ ఒప్పించి రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక తెలంగాణను సాధించారు. సీఎం కేసీఆర్ అనుకున్న విధంగా దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ దేశ ప్రజల చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. ప్రస్తుతం దేశరాజకీయాలకు వస్తే దేశవ్యాప్తంగా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అందరికీ అందిస్తారు. కేంద్ర బీజేపీ సర్కార్ దుర్మార్గ పాలనను అంతమొందించే సత్తా ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే.
– కల్లూరి హరికృష్ణ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, శివ్వంపేట