సిద్దిపేట అర్బన్, ఆగస్టు 17: తెలంగాణలో అమలు చేస్తు న్న రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి ఉచిత వి ద్యుత్ వంటి పథకాలతో రైతులకు మేలు జరుగుతున్నదని, అందుకే రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని శివానుభవ మండపంలో జరుగుతున్న సీపీఐ 3వ జిల్లా మహాసభలకు ఆయన బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లో మోదీ ప్రభుత్వం నినాదాలకే పరిమితమైంని, పథకాలు సరిగ్గా అమలుచేయడం లేదని విమర్శించారు.
ఉచిత పథకాల వద్దంటున్న మోదీ సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పేదల నుంచి దూరం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఆదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్లకు మోదీ లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. మోదీ సర్కారు పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు.
బీజేపీ పాలనలో దేశంలో మతోన్మాదం, నియంతృత్వం బాగా పెరిగిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టంచేశారు. అనంతరం సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు వెంకట్రామ్రెడ్డి, బన్సీలాల్, లక్ష్మణ్, శంకర్, కుమార్ పాల్గొన్నారు.