నా పేరు అమ్మకుట్టి సుజాత. ఖానాపూర్ గ్రామం. మాది పేద కుటుంబం. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డ. మనిషి సాయం లేనిదే బయటికి వెళ్లలేకపోయిన. బ్యాటరీ ట్రైసైకిల్ ఉంటే బాగుంటుంది అనుకున్న. ఇంకా రుణ సాయం చేస్తే స్వయం ఉపాధి పెట్టుకుందామని అనుకున్న. గతంలో ఎవరూ పట్టించుకోలే. స్వరాష్ట్రంలోనే న్యాయం జరిగింది. నాకు ప్రభుత్వం ద్వారా 100శాతం సబ్సిడీతో రూ.50వేల రుణంతోపాటు బ్యాటరీ ట్రై సైకిల్ను ఇచ్చిన్రు. చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
మంథని టౌన్, డిసెంబర్ 21;దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటున్నది. అనేక పథకాలతో ధీమా కల్పిస్తూనే, నెలనెలా పింఛన్తో భరోసా ఇస్తున్నది. మానసిక స్థితితోపాటు చేతులు బాగుండి కాళ్లు సరిగ్గాలేక నడవలేని స్థితిలో ఉన్న అసహాయులకు పైసా ఖర్చు లేకుండా చార్జింగ్ ట్రైసైకిళ్లు ఇస్తున్నది. ఇక ఉన్నత విద్యాభాస్యం చేసేవారికి జూపిటర్ వాహనాలు, కదల్లేనివారికి బ్యాటరీ వీల్ చైర్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్లు, 4జీ స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్ స్టిక్స్, ఇతర వినికిడి, దృష్టిలోపం కలిగిన వారికి యంత్రాలను ఇస్తున్నది.
138 మందికి అందజేత..
మంథని డివిజన్లో పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు చెందిన 138 మంది దివ్యాంగులకు మంగళవారం ఉపకరణాలు అందజేశారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా మంజూరుకాగా, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జడ్పీచైర్మన్ మధూకర్ అందజేశారు. 56 మందికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, 40 వినికిడి యంత్రాలు, అందుల కోసం 20 స్మార్ట్ కేన్లు, మానసిక దివ్యాంగుల కోసం 20 ఎంఎస్ఐఈడీలు, నలుగురికి స్వయం ఉపాధి కోసం 100 శాతం సబ్సిడీతో 50వేల చొప్పున 2లక్షలు అందజేశారు.
అండగా ఉంటాం: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అండగా ఉంటామని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. మంగళవారం మంథని డివిజన్ పరిధిలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలకు చెందిన దివ్యాంగులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ఉపకరణాలను స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా 35వేల విలువైన బ్యాటరీ వీల్ చైర్లు, 42వేల విలువైన ట్రై సైకిళ్లు, ఉన్నత విద్య చదివేవారికి 1.10 లక్షల విలువైన యాక్టివా స్కూటర్లు, ల్యాప్టాప్లను ఇస్తున్నదని వివరించారు. దివ్యాంగుల కోసం బ్యాటరీ ట్రై సైకిళ్లను మంజూరు చేయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నామని చెప్పారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీలు కొండ శంకర్, ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్, ముత్తయ్య, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు శ్రీపతి బానయ్య, వీకే. రవి, గుండా పాపారావు విజయలక్ష్మి, డీడబ్ల్యూవో రవూఫ్ఖా న్, సీడీపీవో పద్మశ్రీ పాల్గొన్నారు.
వెన్నుదన్నుగా ఉంటాం..
రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నరు. అనేక పథకాలు అమలు చేస్తున్నరు. ఇంకా దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు నియోజకవర్గంలో దాదాపు 10వేల మంది దివ్యాంగులం ఎల్లప్పుడూ అండగా ఉంటూ మద్దతిస్తాం. బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేసిన ప్రభుత్వం, జడ్పీ చైర్మన్కు ప్రత్యేక కృతజ్ఞతలు.