తెలుగుయూనివర్సిటీ : సాహితీవేత్తలు ప్రాచీన వాఙ్మయాన్ని, సాహిత్యాన్ని నేటి తరానికి అందించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో మహా పండితుడు పోలూరి హనుమ జ్జానకీరామశర్మ పేరుతో నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని పండితుడు డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్యకు ప్రధానోత్సవం పరిషత్ ప్రాంగణంలో గల డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో ఘనంగా జరిగింది.
పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పురస్కారం కింద 25వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సుప్రసన్నాచార్యను సత్కరించారు. ఈ సందర్బంగా పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య రచించిన డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గ్రంథాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నెల్లూరులో వి.ఆర్ కళాశాలలో డిగ్రీలో తెలుగు పాఠాలు భోధించిన హనుమజ్జానకీరామశర్మ పేరిట పరిషత్తులో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని సుప్రసన్నాచార్యకు ప్రధానం చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
గురువుల స్పూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల తన గురువులు మక్కువ పెంచారని గుర్తు చేసుకున్నారు. వారి ప్రేరణతోనే రాజకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుకుని ధారళంగా మాట్లాడుతున్నానన్నారు. నేటి పురస్కార కార్యక్రమానికి హాజరుకావడం సంతృప్తినిచ్చి గురువు రుణం తీర్చుకున్నానని ఆయన వివరించారు.
మాతృభాష నేర్చుకోవడం కూడా నేరంగా భావించే రోజుల్లో పరిషత్తు తెలుగు భాషను సంరక్షించుకునే సంకల్పంతో నెలకొల్పబడిందని నిత్యనూతనం సంతరించుకుంటూ తెలుగు భాషా వెలుగులను ముందు తరాలకు అందించేల కృషి చేస్తూ స్పూర్తిదాయకంగా నిలించిందన్నారు. డాక్టర్ దేవుపల్లి రామానుజరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డిల కృషిని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి మాట్లాడుతూ సాహిత్యంలో నిఖచ్చిగా వ్యవహరించే గొప్ప వ్యక్తిత్వం కోవెల సుప్రసన్నాచార్య సొంతమని అన్నారు. సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన చెయ్యి సుప్రసన్నాచార్యదని గుర్తు చేశారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జురు చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు. పోలూరి హనుమజ్జానకీరామశర్మ జీవితం సాహిత్యంపైన, తెలంగాణ సారస్వత పరిషత్తు చరిత్రపైన ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.