హిమాయత్నగర్ : తనకు జీవితం మీద విరక్తి కలిగిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఓ యువతి ఇన్స్ట్రాగ్రామ్లో లైవ్ రికార్డింగ్ పెట్టింది. చీరతో మెడకు ఉరేసుకుంటున్న విషయాన్ని ఆమె స్నేహితులు చూసి డయల్ 100కు కాల్ చేసి చెప్పగా హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని కాపాడారు. నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన హాసిని (23) మోడలింగ్పై ఆసక్తితో నాలుగేండ్ల క్రితం నగరానికి వచ్చింది. 2018లో మిస్ తెలంగాణ పోటీలకు ఎంపికైన హాసిని నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత సినిమాల్లో ,సీరియళ్లలో అవకాశం కోసం చూస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో గత కొంతకాలంగా హాసిని హిమాయత్నగర్ స్ట్రీట్ నెం 6లోని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో తన ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలోంచి లైవ్ వీడియో రికార్డింగ్ ఆన్చేసిన హాసిని తాను జీవితంపై విరక్తి చెందానని, తాను చనిపోతున్నానంటూ చెబుతూ చీరతో ఫ్యాన్కు ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె వీడియోను చూస్తున్న షన్ను అనే స్నేహితుడు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను అప్రమత్తం చేశాడు. దాంతో నారాయణగూడ పోలీసులు వెంటనే స్పందించి అపార్ట్మెంట్కు వెళ్లారు.
ఫ్లాట్ తలుపులు దగ్గరకు వేసి ఉండడంతో లోనికి ప్రవేశించిన పోలీసులు హాసినిని కాపాడారు. ఆమెను హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె గొంతుకు ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కాగా జరిగిన విషయం తెలుసుకున్న హాసిని కుటుంబ సభ్యులు ఆస్పత్రివద్దకు వచ్చి ఆమెను విజయవాడకు తీసుకువెళ్లారు.
ఇదిలా ఉండగా హాసిని గతంలో ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిందితుడితో రాజీ పడడడంతో కేసు నమోదు కాలేదు. అంతకుముందు కూడా మరో యువకుడిపై ఆమె ఫిర్యాదు చేసి వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని ఆమె పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.