వేసవిలో అడవుల సంరక్షణకు చర్యలు
అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ
వేసవి దృష్ట్యా ముందస్తు చర్యలు
అగ్నిప్రమాదాల నివారణకు 8 బృందాలు
లక్ష్మీదేవిపల్లి, మార్చి 24: వేసవి వచ్చిదంటే చాలు.. అడవులను కార్చిచ్చు కాటేస్తుంటుంది. విలువైన అటవీ సంపదను దహిస్తుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఆస్తి నష్టం, వన్యప్రాణులకు ప్రాణ నష్టం, మనుషులకు అటవీ సంపద నష్టం వాటిల్లుతుంటుంది. అయితే వీటి నివారణకు అటవీ శాఖ సన్నద్ధమైంది. ఈ ఏడాది పూర్తిస్థాయి వేసవి ప్రారంభం కాకముందే అడవుల్లో కార్చిచ్చు వ్యాపించి విలువైన అటవీ సంపద నాశనం కాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటవీ భూములను రక్షించుకునేందుకు అడవుల్లో విలువైన మొక్కలు నాటింది. దీంతో అటవీ విస్తీర్ణం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కార్చిచ్చు వంటివి అడవులను కబళించకుండా ఉండేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
కార్చిచ్చుకు కారణాలు అనేకం..
విలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలుంటాయి. భద్రాద్రి జిల్లాలో సుమారు 4.30 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచిఉంది. అయితే అడవిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రథమ కారణం మాత్రం మనుషులే. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ఆయా వ్యక్తులు బీడీ, సిగరెట్లు తాగి కింద పడేస్తుంటారు. ఇది రాచుకుని చిన్న చిన్న మంటలుగా మొదలై కార్చిచ్చుగా వ్యాపిస్తుంది. చిన్న మంటగా ఉన్న సమయంలో ఎవరూ గమనించే అవకాశం లేకపోవడంతో వెంటనే పక్కకు పాకుతుంది. అలాగే కొంతమంది అడవిలో సంచరిస్తూ భోజనాలు తదితర వంటలు చేసుకుని నిప్పును పూర్తిగా ఆర్పివేయకుండానే వెళ్లిపోతుంటారు. ఈ విధంగా కూడా నిప్పు వ్యాపిస్తుంది. వేసవి కాలం కావడంతో మంటలు సులువుగా వ్యాపిస్తుంటాయి. అలాగే వేసవిలో చెట్ల ఆకులు ఎండి రాలిపోతుంటాయి. అటవీ ప్రాంతంలో కింద మొత్తం ఎండిపోయిన ఆకులు ఉండటం.. అడవిలో పెద్ద పెద్ద గుట్టలపై నుంచి రాళ్లు జారి పడేటప్పుడు రాపిడి జరగడం వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండుటాకులపై పడటంతో మంటలు వ్యాపిస్తుంటాయి. ఇక అటవీ ప్రాంతం సమీపంలో పొలాలు ఉన్న రైతులు చెత్తను తగలబెట్టిన సమయంలో నిప్పు రవ్వలు అడవిలో పడి కార్చిచ్చుకు కారణమవుతుంది.
ముందస్తు చర్యలు..
కార్చిచ్చు వ్యాపించకుండా అటవీ శాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవికి వెళ్లిన సమయంలో నిప్పులు తదితర వాటిని రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చి పడేయవద్దని సూచిస్తున్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. బేస్క్యాంప్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంరక్షణ కోసం పనిచేస్తాయి. ఈ టీమ్లో ఐదుగురు సభ్యులు ఉంటారు. వారికి కావాల్సిన భోజన, క్యాంపు వసతి కల్పిస్తారు. వారు అటవీ ప్రాంతంలోనే ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీరు పగలూ రాత్రీ అడవిలోనే గస్తీ తిరుగుతూ అడవిని, వన్యప్రాణులను కాపాడుతారు. అలాగే ట్రాక్టర్లతో పిక్స్లో నీటిని నింపుతారు. అడవిలో కార్చిచ్చు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారు.