ఇంటి పన్ను వసూళ్లలో భద్రాద్రి జిల్లా ముందంజ
ఇప్పటి వరకు 91.25 శాతం పూర్తి
వందశాతం వసూలుకు చర్యలు
ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం పూర్తి
కొత్తగూడెం, మార్చి 17: గతంలో ఒక్కో పంచాయతీ కార్యదర్శి పరిధిలో నాలుగైదు గ్రామాలు ఉండడం.. ఒక్కరే పన్ను వసూలు చేయడం కష్టతరంగా ఉండేది. దీంతో బకాయిలు పెరిగిపోయేవి. ఏడాదిలో పన్ను వసూలు శాతం 60, 70 శాతం మించేది కాదు. తెలంగాణ సర్కార్ చిన్న పంచాయతీలను ఏర్పాటు చేయడంతో అధికారులు ఇంటింటికీ వెళ్లడంతో పన్నుల వసూలు సులభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లలో అధికారులు లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు. డీపీవో, డివిజన్ స్థాయిలో డీఎల్పీవోలు, మండల స్థాయిలో ఎంపీవోలు పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అన్ని పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్ను వసూళ్లు వేగవంతం చేశారు. ఈ ఏడాది రూ.15.12 కోట్లు ఇంటి పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.13.80 కోట్లు వసూలైంది. పన్ను వసూలు91.25 శాతంగా నమోదైంది.
పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లలో గతంలో కంటే పురోగతి కనిపిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామస్తులకు మౌలిక వసతులు సమకూరాయి. చిన్న పంచాయతీల ఏర్పాటుతో పాలన కూడా సులభమైంది. దీంతో పన్ను వసూలు కూడా ఏటేటా పెరుగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 481 పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం రూ.15.12 కోట్లు ఇంటి పన్ను చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.13.80 కోట్లు వసూలైంది. వసూలుశాతం 91.25 గా నమోదైంది. భద్రాచలం డివిజన్ పరిధిలో పంచాయతీలు 159 ఉండగా 9.46 కోట్ల లక్ష్యం ఉండగా 8.35 కోట్లు వసూలైంది. వసూలు శాతం 88.23శాతం నమోదైంది. కొత్తగూడెం డివిజన్లో 322 పంచాయతీలు ఉండగా రూ.5.65 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అధికారులు ఇప్పటివరకు రూ.5.44 కోట్లు వసూలు చేశారు. వసూలు శాతం 96.71గా నమోదైంది. ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్ను వసూలును వేగవంతం చేశారు.
434 పంచాయతీల్లో వందశాతం పూర్తి..
జిల్లాలోని 481 పంచాయతీలకు గాను 434 పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు వందశాతం పూర్తయింది. కొన్ని మేజర్ పంచాయతీల్లో మొండి బకాయిలు మినహా అంతటా వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో డీపీవో, డివిజన్ స్థాయిలో డీఎల్పీవోలు, మండల స్థాయిలో ఎంపీవోలు పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించడంతో వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ నెలాఖరు లోపు వందశాతం పన్ను వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చిన్న పంచాయతీల ఏర్పాటుతో..
గతంలో పెద్ద పంచాయతీలుగా ఉన్న వాటిని జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయతీలు ఏర్పాటు చేయడంతో పాలన సులభమైంది. పన్నుల వసూలు కూడా సులభతరమైంది. గతంలో ఒక్కో పంచాయతీ కార్యదర్శి పరిధిలో నాలుగైదు గ్రామాలు ఉండడంతో ఒక్కరే పన్ను వసూలు చేయడం కష్టతరంగా ఉండేది. దీంతో మొండి బకాయిలు పెరిగిపోయేవి. ఏడాదిలో పన్ను వసూలు శాతం 60, 70 శాతం మించేది కాదు. తెలంగాణ సర్కార్ చిన్న పంచాయతీల ఏర్పాటు చేయడంతో అధికారులు ఇంటింటికీ వెళ్లడం కుదురుతున్నది. దీంతో పన్నుల వసూలు కూడా సులభమైంది.
వేగంగా పన్ను వసూళ్లు..
ఇంటి పన్ను వసూలుకు పంచాయతీ కార్యదర్శులు ఇంటింటకీ తిరుగుతున్నారు. జిల్లాలోని ఎక్కువ పంచాయతీల్లో వందశాతం ఇంటి పన్ను వసూలు పూర్తయింది. దీంతో పంచాయతీలకు ఆదాయం పెరిగింది. అధికారులు నిత్యం వసూళ్లను పర్యవేక్షించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మిగిలిన పన్ను కూడా వసూలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.