నేడు ఉదయం 8 గంటల నుంచి మొదలు
తొలుత అన్ని బ్యాలెట్ పత్రాల కట్టల కార్యక్రమం
రాత్రి ఎనిమిది నుంచి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు
రేపు ఉదయానికి ప్రథమ ప్రాధాన్య ఫలితాలు
అనంతరమే గెలుపు కోటా నిర్ధారణ
కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ కొనసాగింపు
ఖమ్మం, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నల్లగొండలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టే కార్యక్రమాన్ని చేపడతారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం అసలు లెక్కింపు మొదలు కానుంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల చొప్పున ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇలా మొత్తం ఏడు రౌండ్లలో పోలైన 3,86,320 ఓట్లను లెక్కించనున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయి కోటా నిర్ధారణ అయ్యే సరికి గురువారం ఉదయం ఆరు గంటలు కావచ్చని అంచనా.
పోలింగ్ పల్లాకు అనుకూలమంటున్న టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. బుధవారం నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడతారు. అనంతరం లెక్కింపు మొదలుకానుంది. ఒక్కో రౌండ్లో 56వేల ఓట్ల చొప్పున ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగనుంది. గురువారం వరకు ఫలితం తేలనుంది. కౌంటింగ్లో పాల్గొనడానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లు నల్గొండకు తరలివెళ్లారు.
మొత్తం ఎనిమిది కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు జరుపనున్నారు. ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 56 టేబుళ్లపై నిరాటంకంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. మూడు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. సమయంతో సంబంధం లేకుండా తొలి షిఫ్టులో విధులకు హాజరయ్యే సిబ్బంది బ్యాలెట్ల పత్రాలు కట్టలు కట్టే కార్యక్రమం ముగిసే వరకూ ఉంటారు. రెండో షిఫ్టు సిబ్బంది తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా ఉంటారు. మూడో షిఫ్టు సిబ్బంది ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసి విజేత తేలే వరకు విధులు నిర్వర్తిస్తారు.
రాత్రి 8 నుంచి అసలు కౌంటింగ్..
బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపును మొదలుపెట్టనున్నారు. ఒక్కో టేబుల్కు 40 బండిల్స్ చొప్పున పంపిణీ చేసి మొత్తం వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ఇలా లెక్కించే సమయంలోనే అభ్యర్థులకు వచ్చే ఓట్లను చెల్లని ఓట్లను ప్రత్యేకంగా బ్యాగుల్లో వేస్తారు. మొత్తం ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం ఏడు రౌండ్లు కొనసాగనున్నాయి. ఇదంతా పూర్తయ్యే సరికి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై, చెల్లని ఓట్లపై స్పష్టత రానుంది. చెల్లని ఓట్లను ఒక చోటకు చేర్చి లెక్కించి మొత్తం పోలైన ఓట్లలోంచి మైనస్ చేస్తారు. మిగిలిన చెల్లిన ఓట్లల్లోంచి గెలుపు కోటాను నిర్ధారిస్తారు. మొత్తం చెల్లిన ఓట్లలో 50 శాతం+1 ఓటు గెలుపు కోటా కానుంది. అప్పటికీ ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెడతారు. ఈ ప్రక్రియకు మూడో షిఫ్టు సిబ్బంది విధుల్లోకి వస్తారు. తొలి ప్రాధాన్య ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితే కౌంటింగ్ను నిలిపి వేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించనున్నారు.