ఖమ్మం నగరానికి రెండోదశ ఐటీ హబ్
రూ.36 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా ఉత్తర్వులు జారీ
ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషి
ఖమ్మం మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఖమ్మం.. సాంకేతిక గుమ్మంగా మారుతోంది.. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న నగరం ఐటీ రంగంలో మేటిగా నిలువనున్నది. హైదరాబాద్ తరహాలో ఐటీ కంపెనీలను విస్తరించాలన్న సంకల్పంతో రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందుకు సాగుతున్నారు. యువత ఉపాధికి బాటలు వేసి వారికి బంగారు భవిష్యత్ అందించాలన్న ఆయన ఆకాంక్షకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి కోరిక మేరకు ఖమ్మంలో రెండో దశఐటీ హబ్ నిర్మాణానికి రూ.36 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను మంగళవారం జారీచేసింది.
ఖమ్మం నగర సిగలో మరో మణిహారం చేరింది.. ఇప్పటికే విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులతో దూసుకెళ్తున్న జిల్లా.. ఐటీలోనూ మేటిగా నిలువనున్నది. హైదరాబాద్ తరహాలో ఐటీ కంపెనీలను విస్తరించాలన్న సంకల్పంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముందుకు సాగుతున్నారు. యువత ఉపాధికి బాటలు వేసి వారికి బంగారు భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో ఖమ్మంలో రెండో ఐటీహబ్ కోసం కృషి చేశారు. మంత్రి ఆకాంక్ష మేరకు రెండో దశ ఐటీ హబ్ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీని కోసం రూ.36 కోట్లు మంజూరు చేసింది. పరిపాలనా అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశ ఐటీ హబ్తో సమాచార, సాంకేతిక రంగం మరింత విస్తరించనున్నది. అంతేకాదు, యువతకు ఉపాధి అవకాశాలు లభించనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఖమ్మంలో రెండోదశ ఐటీ హబ్ నిర్మాణానికి రూ.36 కోట్ల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు రావడంతో మరింత మందికి ఉపాధి లభించనున్నది. ఇప్పటికే ఖమ్మం నగరంలోని ఇల్లెందుక్రాస్ రోడ్డులో ఐటీహబ్ మొదటి దశ సకల హంగులతో పూర్తయింది. గతేడాది డిసెంబర్ నుంచి సాంకేతిక విద్యనభ్యసించిన నైపుణ్యం కలిగిన యువతకు కొలువులు కల్పిస్తున్నారు. రెండో దశ ఐటీ హబ్ ఖమ్మానికి మంజూరు కావడంతో సమాచార, సాంకేతిక రంగం మరింత విస్తరించనున్నది.
ఐటీ హబ్గా ఖమ్మం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్తోపాటు జిల్లాలో ఐటీ రంగాన్ని విస్తరించాలన్న సంకల్పంతో 2017లో పువ్వాడ అజయ్ చొరవతో ప్రభుత్వం ఐటీహబ్ నిర్మాణ పనులు ప్రారంభించింది. అన్ని హంగులతో పనులు పూర్తి కావడంతో 2020 డిసెంబర్ 7వ తేదీన మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, పువ్వాడ అజయ్కుమార్, మహుమూద్అలీ, వేముల ప్రశాంత్రెడ్డి ఐటీ హబ్ను ప్రారంభించారు. ఐటీ హబ్ మొదటి దశను గ్రౌండ్ ఫ్లోర్తోపాటు 5 అంతస్థులు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. రెండో దశ ఐటీ హబ్ను అదే ప్రాంగణంలో 55 వేల చదరపు అడుగుల్లో 570 మంది ఉద్యోగులు ఒకేసారి విధులు నిర్వర్తించేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఐటీ హబ్ను 41,250 చదరపు అడుగుల్లో 430 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా నిర్మించారు. అయితే, ఇది నిర్మించిన తర్వాత ఆయా కంపెనీలకు నైపుణ్యం కలిగిన సాంకేతిక ఉద్యోగులు లభిస్తున్నారు. దీంతో ఖమ్మం కేంద్రంగా ఐటీ సేవలను విస్తరించడానికి ఆయా కంపెనీలు ఆసక్తి కనపరుస్తున్నాయి. ఖమ్మం నగరాన్ని ఐటీపరంగా ఆదరిస్తూ ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనుకూలంగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రెండోదశ ఐటీ హబ్ కోసం కృషి చేశారు. మంత్రి కృషి ఫలించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నిరుద్యోగులకు వరం ఐటీ హబ్
ఖమ్మం నగరంలో మొదటిదశ ఐటీ హబ్ నిరుద్యోగులకు వరంగా మారింది. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఐటీహబ్ ప్రారంభ సమయంలో మంత్రి కేటీఆర్ రెండోదశ నిర్మాణానికి హామీ ఇచ్చారు. హామీ మేరకు నిధులు మంజూరు చేశారు. అభివృద్ధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఐటీహబ్తో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. రెండోదశ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగుల కోసం మూడోదశ ఐటీ హబ్ మంజూరుకు కృషి చేస్తా. రెండోదశ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కృతజ్ఞతలు.
-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్