ఖైరతాబాద్ : వంద సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని అర్థ దశాబ్ద కాలంలో చేసి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యులని జలవిహార్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ రామరాజు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలోని విమాన గోపురం స్వర్ణతాపడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించడం స్ఫూర్తినిచ్చిందని, తన వంతు విరాళంగా ఒక కిలో బంగారాన్ని అందచేస్తానని ఆయన బుధవారం తెలిపారు.
దేశ చరిత్రను చూసుకుంటే భారతదేశాన్ని పాలించిన చక్రవర్తులు దేశ ప్రజలకు ఉపయోగపడే ఆర్థిక, సాంస్కృతిక, సాంకే తిక ప్రయోజనాలను చేకూర్చి ప్రపంచానికి దేశ ఔనత్యాన్ని చాటిచెప్పారని, అదే సంకల్పం సీఎం కేసీఆర్లో కనిపిస్తున్న దన్నారు. హరితహారం నిర్వహించి అశోక చక్రవర్తిని, మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు చేపట్టి కాకతీయ రాజులను, దేవాలయాల నిర్మాణం చేపట్టి రాజరాజ చోళులను, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, దేవాలయాల అభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణాలు (డబుల్ బెడ్రూం) చేపట్టి శ్రీకృష్ణ దేవరాయలను మరిపించారన్నారు.
అందరి అంచనాలకు భిన్నంగా మన తెలంగాణకు స్వయం విద్యుత్ సంవర్థకం సాధించడంలోనూ ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. ఎన్నో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, హరిత విప్లవం తీసుకువచ్చి తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంతో పాటు దానిలో ప్రజలను భాగస్వాములను చేయడం గొప్ప విషయమన్నారు.
ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళాలు అందజేశారని, తన వంతుగా ఒక కిలో బంగారాన్ని అందచేస్తానని తెలిపారు. ప్రజలు కూడా ధన, కనక, వస్తూ రూపంలో విరాళాలను అందచేయాలని పిలుపునిచ్చారు.