అంగన్వాడీ కేంద్రాల్లో ‘పోషణ్ పక్వాడా’
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 31 వరకు అమలు
పెరటితోటలు, అనుబంధ పౌష్టికాహారంపై అవగాహన
కోటగిరి, మార్చి 26 : గర్భిణులు బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడా(పోషణ పక్షం) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. లబ్ధిదారులు, తల్లులకు పోషణ విలువలు, అదనపు ఆహార విశిష్టత, తల్లి పాల ఆవశ్యకత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 16న ప్రారంభమైన కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఈ సారి పెరటితోటలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఖాళీ ప్రదేశం ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం, పెంచే మొక్కలను పర్యవేక్షించనున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వంటల పోటీలు, పోషకాహార ప్రభాతభేరి, పోషణ ర్యాలీలు, యోగాపై అవగాహన, కిచెన్ గార్డెనింగ్ వంటివి నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్, భీమ్గల్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. పౌష్టికాహారలోపం లేని గ్రామం, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సరైన పోషణ, పౌష్టికాహారం, తాగునీరు పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్లు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందే సేవలను పూర్తిస్థాయిలో లభ్ధిదారులకు తెలియపరిచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలను పోషకాహారలోపం నుంచి విముక్తులను చేయడం ఆరోగ్యవంతులను చేయడానికి పోషణ్ పక్వాడా దోహదపడనుంది.
రోజువారీ కార్యక్రమాలు..
పోషణ పక్షం సందర్భంగా నిర్ణీత కార్యాచరణ ప్రకారం కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ టీచర్లు లబ్ధిదారులు, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.
-శ్రీలత, సూపర్వైజర్, కోటగిరి
పౌష్టికాహార లోపాన్ని నిర్మూలిస్తాం..
మహిళలు, చిన్నారు ల్లో పౌష్టికాహార లో పం నిర్మూలనే లక్ష్యం గా పోషణ పక్షం నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. స్వయం సహాయక, యువజన సంఘాలను భాగస్వాములను చేస్తున్నాం.
-ఝాన్సీరాణి, ఇన్చార్జి పీడీ, నిజామాబాద్