15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో మార్పులు
ఆన్టైడ్ నిధుల వినియోగంపై జీవో జారీ
గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధించిన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు
నిజామాబాద్ సిటీ, మార్చి 22: 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సంక్లిష్టంగా ఉన్న మార్గదర్శకాలను సడలించడంతో గ్రామీణాభివృద్ధికి మరిన్ని నిధులు రానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. జడ్పీకి వస్తున్న 15వ ఆర్థిక సంఘం ఆన్టైడ్ నిధుల గైడ్లైన్స్లో మార్పులు చేయాలని కోరుతూ నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సీఎం కేసీఆర్కు ఇటీవల వినతిపత్రం అందజేశారు. స్పందించిన ప్రభుత్వం ఆర్థిక సంఘం ఆన్టైడ్ నిధులను వినియోగించుకునేలా జీవో జారీచేసింది. జడ్పీలకు రాష్ట్ర బడ్జెట్లో 252కోట్ల నిధుల్ని కేటాయించగా.. తాజా నిధులతో అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడానికి మరిన్ని నిధులు మం జూరు కానున్నాయి. ప్రత్యేక నిధుల వినియోగంతో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కారం కానున్నాయి. జడ్పీకి వస్తున్న 15వ ఆర్థిక సంఘ నిధుల గైడ్లైన్స్లో కొన్ని మార్పులు చేయడానికి చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రభుత్వానికి విన్నవించగా, ఆయన కృషి ఫలించింది. ఆన్టైడ్ నిధులకు సంబంధించిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జడ్పీలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం ఆన్టైడ్ నిధుల వినియోగంలో భాగంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మించుకోవచ్చని జీవో జారీ చేసింది. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో జడ్పీలకు రూ. 252 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులకు మోక్షం లభించించనున్నది. రానున్న రోజుల్లో జడ్పీలకు కేటాయించే బడ్జెట్తో ప్రణాళిక మేరకు పల్లెలు మరింత అభివృద్ధి కానున్నాయి.
ప్రత్యేక జీవో విడుదల
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తిచేసింది. గ్రామాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలకమైంది. జడ్పీకి వచ్చే నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, మురికి కాలువలు తదితర పనులు చేపడతారు. మొన్నటి వరకు 50శాతం నిధులు తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్మాణం చేపట్టడానికి వినియోగించడానికి అవకాశం ఉండగా, మరో 50శాతం కేవలం పాఠశాలల్లో ల్యాబ్ల కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. దీంతో ఆన్టైడ్ నిధులకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పు చేయాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో చైర్మన్తోపాటు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని పలుమార్లు కోరారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు కూడా ప్రత్యేక దృష్టిసారించి సీఎం కేసీఆర్తోపాటు సంబంధిత మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, దయాకర్రావు, ఎమ్మెల్సీ కవితను కలిసి మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని కోరారు. ఈ విషయపై సీఎం కేసీఆర్ పునరాలోచన చేసి సంబంధిత అధికారులతో చర్చించారు. ఆన్టైడ్ నిధులు పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి ఉపయోగించుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయించారు. దీంతో జిల్లాలోని జడ్పీ టీసీలు, ఎంపీపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.252 కోట్ల నిధులతో మరింత అభివృద్ధి
జడ్పీలకు రూ.252కోట్లు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ బడ్జెట్తో గ్రామాల రూపురేఖలు మరింతగా మారనున్నా యి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించనున్నారు. ప్రస్తుతం కొత్తగా ప్రకటించిన బడ్జెట్కు సంబంధించి నిధుల వినియోగంపై త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నది.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
15వ ఆర్థిక సంఘం ఆన్టైడ్ నిధుల్లో మార్పు చేసి పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి వినియోగించుకోవడానికి జీవో జారీ చేసినందుకు, బడ్జెట్లో రూ.252 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, దయాకర్రావు, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. రాబోయే బడ్జెట్తో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అందరితో చర్చించి ప్రణాళిక రూ పొందిస్తాం. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం.
-దాదన్నగారి విఠల్రావు,
నిజామాబాద్ జడ్పీ చైర్మన్