అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పెద్ద ఎత్తున కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
సాలూరా చెక్పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు
నిఘా పెరగడంతో ఇతర మార్గాల ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్న మహారాష్ట్రవాసులు
బోధన్, మార్చి 17: ఉమ్మడి జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో దాని ప్రభావం మన జిల్లాలోనూ చూపుతున్నది. సరిహద్దు గ్రామాలతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి అధికార యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలుచోట్ల మరాఠాల కాంటాక్ట్ల ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
జిల్లాకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ఆ రాష్ర్టానికి ఆనుకుని ఉన్న మన జిల్లాలోని గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు గ్రామాల్లోనే కాకుండా జిల్లాలోని పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో మరోసారి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల రోజుల క్రితం మహారాష్ట్రలో కరోనా కేసులు రావడంతో వైద్యఆర్యోగశాఖ అప్రమత్తమై సరిహద్దులో పరీక్షలు నిర్వహించింది. పెద్దగా పాజిటివ్ కేసులు రాకపోవడంతో రెండు రాష్ర్టాల సరిహద్దులోని సాలూరా చెక్పోస్ట్ వద్ద తప్ప మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహించలేదు. నాలుగైదు రోజులుగా ఉమ్మడి జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పట్టణాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్లో ఐదు రోజులుగా కరోనా నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల మరాఠాల కాంటాక్ట్ల ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లాలోని సాలూరా చెక్పోస్ట్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారితో పాటు బోధన్ ఆర్డీవో సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం తప్ప కొవిడ్ పరీక్షలు తగ్గిపోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ వెంటనే కొవిడ్ పరీక్షల కోసం దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో రెండు, మూడు రోజులుగా అన్ని దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు జోరుగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులు, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టారు. కొత్తగా బుధవారం కోటగిరి మండలం పొతంగల్ వద్ద కరోనా పరీక్షల కోసం చెక్పోస్ట్ను ఏర్పాటుచేశారు. రెంజల్ మండలం కందకుర్తి వద్ద కొత్తగా చెక్పోస్ట్ను ఏర్పాటుచేయాలన్న యోచనలో ఉన్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణం రోగులకు వైద్యాన్ని అందించేందుకు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఐసోలేషన్ వార్డును పునరుద్ధరించారు. వార్డుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు
ఉమ్మడి జిల్లాకు మహారాష్ట్రతో సుమారు 150 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. సరిహద్దు గ్రామాల ప్రజలకు, మహారాష్ట్రలో బంధుత్వాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలకు, ఇతరత్రా పనులకు రెం డు రాష్ర్టాల మధ్య రాకపోకలు సర్వసాధారణం. ఇక, వ్యాపారపరంగా దెగ్లూర్, కొండల్వాడి, నర్సీ తదితర పట్టణాలకు ఇక్కడి నుంచి వ్యాపారులు వెళ్లివస్తుంటారు. మహారాష్ట్ర నుంచి మన అంగళ్లకు కూరగాయలను తెచ్చి అమ్ముతుంటారు. దీంతో అక్కడ ప్రబలుతున్న కరోనా మన సరిహద్దు గ్రామాలు, పట్టణాలకు వ్యాపించే అవకాశం ఉంది. దీంతో అక్కడి నుంచి సరిహద్దు దాటి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాలూరా చెక్పోస్ట్ వద్ద..
మూడు రోజుల్లో ఏడుగురికి పాజిటివ్
సరిహద్దులోని సాలూరా వద్ద ఏర్పాటుచేసిన కరోనా పరీక్షల నిర్ధారణ శిబిరంలో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి, ప్రయాణికులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత నెల 23 నుంచి ఇప్పటివరకు సాలూరా చెక్పోస్ట్ వద్ద 1137 మందికి ఆర్టీఏ పరీక్షలు చేశారు. సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహించిన పరీక్షల్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారికి హోం ఐసోలేషన్ కిట్లను అందించి తిరిగి మహారాష్ట్రకు పంపించారు. వారితో కలిసివచ్చిన వారికి వారి స్వగ్రామాల్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.
మండలాల్లోనూ పెరుగుతున్న కేసులు
బోధన్, కోటగిరి, రెంజల్ మండలాల్లో రెండు, మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రెంజల్ మండలంలో నలుగురికి, కోటగిరి మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు. బోధన్ పట్టణంలో రెండు రోజుల క్రితం కరోనా పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ తేలింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. కొవిడ్ నిబంధనలపై ప్రజలను అప్రమత్తంచేయాలని అధికారులు యోచిస్తున్నారు.