తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రజలు పట్టం కట్టాలని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ది పీఠం ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్బాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన టంకశాల అశోక్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణతనానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడడమే కాకుండా హావభావాలు పలికించేవారని పేర్కొన్నారు. తెలంగాణ యాస, భాషకు పట్టం కట్టేందుకు ప్రభు త్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాళోజీ కలలు కన్నరీతిలో ఉన్నతిని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగువర్సిటీ వీసీ టి. కిషన్రావు మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యానికి అస్తిత్వ స్పృహను అందించారని గుర్తు చేశారు. తెలంగాణ భాషకు, యాసకు కాళోజీ ప్రతిక అన్నారు. ఆయన నిరాడంబర జీవనాన్ని కొనసాగించారన్నారు. వర్సిటీ భాషాభివృద్ది పీఠం అధిపతి ఆచార్య రెడ్డి శ్యామల, విస్తరణసేవా విభాగం ఇంచార్జి రింగురామ్మూర్తి పాల్గొన్నారు.