కవాడిగూడ : తెలంగాణ ఉద్యమకాలంలో ఒక సిద్దాంతకర్తగా నాయకత్వానికి చక్కని మార్గనిర్దేశనం చేసిన గొప్ప దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల గుండెలోతుల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చగలిగిన ఆయన ప్రజల చేత తెలంగాణ జాతిపితగా గుర్తించబడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్యసాధన ఫౌండేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక కవితా సంకలనం’ ను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, పలువురు కవులు, రచయితలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
అనంతరం తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ అధ్యక్షతన జరిగిన సభలో నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఆరు దశాబ్ధాల తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాల నడుమ ప్రత్యక్ష సాక్షి జయశంకర్ సార్ అని అన్నారు. గాలిని, కాలాన్ని, చైతన్యాన్ని తెలంగాణ వైపు మళ్లించిన జాతి వైతాళికుడు అని కొనియాడారు. తెలంగాణ ముల్కీ ఉద్యమంలో విద్యార్థిగా ఉరకలెత్తించాడని అన్నారు.
జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించేవారిపై తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని అన్నారు. తెలంగాణ రావడమే ఒక గొప్ప చరిత్ర అని, అది ఒక మైలురాయి అన్నారు. కొన్ని ఫలితాలను సాధించుకున్నామని, మిగిలిన కళలను సాఫల్యం చేసుకునేందుకు కవులు, రచయితలు, కళాకారులు కవితలు రాస్తూ ఉండాలన్నారు. ప్రజా ఉద్యమాలే దానికి ప్రేరణవుతాయని అన్నారు. ప్రజా ఉద్యమాలు లేకపోతే ఎవరూ పట్టించుకొరని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, నేటి నిజం సంపాదకులు బైసా దేవదాస్, ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ చైర్మన్ అశోక్ యాదవ్, తెలుగు భాషా చైతన్య సమితి ముఖ్య సలహాదారు ఆళ్ల రామకృష్ణ, తెలంగాణ హైకోర్టు న్యాయవాది కొంకల జంగయ్యలు పాల్గొనగా పలువురు కవులు, రచయితలను నందిని సిధారెడ్డి షాలువాలతో ఘనంగా సత్కరించారు.