వేయిస్తంభాల గుడి పనులు వెంటనే పూర్తి చేయండి
రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయండి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి టీఆర్ఎస్ ఎంపీల వినతి
హన్మకొండ, మార్చి 24 : వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వేయిస్తంభాల గుడి పునురుద్ధరణ పనులు వెంటనే పూర్తి చేయాలని, రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, బండా ప్రకాశ్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్సింగ్ పటేల్ను కలిసి వినతిపత్రం అందించారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయం, రామప్ప ఆలయాల్లో చేపట్టిన సమగ్రాభివృద్ధి, పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఇప్పటికే ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. కాకతీయుల రాజధాని అయిన వరంగల్ జిల్లా కేంద్రం నడిబొడ్డున వేయిస్తంభాల ఆలయం నిర్మించారని, కాకతీయులు కట్టిన అత్యద్భుత ఆలయాల్లో ఇది ముఖ్యమైనదని పేర్కొన్నారు. క్రీ.శ 1175-1324 మధ్య ఆలయం నిర్మించారని, 800 సంవత్సరాలకు పైనే గడిచినా చెక్కుచెదరకుండా ఉన్నా ఒకట్రెండు స్తంభాలు ఒరిగాయన్న కారణంగా ఆలయానికి దక్షిణాన ఉన్న నాట్యమండపం పునర్నిర్మాణం కోసం 2005లో భారత పురావస్తు శాఖ మిగతా స్తంభాలను తొలిగించిందని చెప్పారు. పునరుద్ధరణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, 18నెలల్లోపే పూర్తి చేయాలనుకున్నా దశాబ్దం గడిచినా పూర్తికాలేదని, వెంటనే పూర్తి చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
రామప్పను అభివృద్ధి చేయాలి..
భారతదేశంలో శిల్పి పేరు మీద ఉన్న ఏకైక ఆలయం రామప్ప అని, ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీలు, ఎమ్మెల్సీ లేఖలో పేర్కొన్నారు. ఇది క్రీ.శ 1213 నాటిదని, 17వ శతాబ్దంలో భూకంపం సంభవించినప్పుడు పాక్షికంగా దెబ్బతిన్నదని, నిర్మాణాలు సైతం శిథిలావస్థకు చేరాయని, కుడి వైపున ఉన్న కామేశ్వరాలయాన్ని కూల్చివేశారని, ఆలయ బయటి గోడలో ప్రధాన ప్రవేశ ద్వారం కూడా దెబ్బతిన్నదని, ఈ దశలో ఆలయ పునరుద్ధరణ జరగాల్సి ఉందని కేంద్ర మంత్రికి విన్నవించారు.