అమీర్పేట్: చాలాకాలం తర్వాత పాఠశాలలు తెరుచుకున్న పరిస్థితుల్లో సనత్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఎప్పటిలాగే మెరుగైన వసతుల కల్పనకు మంత్రి తలసాని చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్ల నిధులతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. మంత్రి తలసాని ఆదేశాల మేరకు సనత్నగర్, అమీర్పేట్ డివిజన్లలో టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం పాఠశాలల సందర్శన చేపట్టారు.
ఆయా పాఠశాలల్లో మౌళిక వసతులు ఏ మేరకు ఉన్నాయి. ఎలాంటి వసతులు కల్పించాలనే విషయంలో నాయకులు అంచనాలు తయారు చేసి మంత్రికి నివేదించనున్నారు. కాగా పార్టీ నాయకుల పర్యటనలో సనత్నగర్ డివిజన్ అశోక్ కాలనీ ప్రభుత్వ తెలుగు, ఉర్దూ మీడియం కొనసాగుతున్న పాఠశాల భవనంలో అధికంగా సమస్యలున్నట్టు కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి పర్యటనలో తేలింది.
ఈ పాఠశాలలో టెర్రస్ ఫ్లోరింగ్ (3.5 వేల చ. అ), గ్రౌండ్ ఫోర్లో షాబాద్ ఫ్లోరింగ్ (1000 చ.అ), విద్యార్ధుల అవసరాల నిమిత్తం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, పాఠశాల ప్రహరీగోడ ఎత్తు పెంచడం, శిధిలమైన కిటికీల మరమ్మతులు, స్టెయిర్ కేస్ మరమ్మతులు, పాడైన మంచినీటి ట్యాంక్ నల్లాలు (15), పాఠశాలకు పెయింటింగ్ వంటి సమస్యలున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్రెడ్డి కార్పొరేటర్ లక్ష్మిరెడ్డికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
అమీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి ప్రధానోపాధ్యాయులు మధుతో కలిసి సమస్యలను పరిశీలించారు. విద్యార్ధుల సౌలభ్యానికి నూతన టాయ్లెట్లు నిర్మించాలని, దీంతో పాటు పాఠశాల ఆవరణలో షెడ్డు నిర్మాణాలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులు మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే మంత్రి తలసానికి నివేదిస్తామని కొలను లక్ష్మిరెడ్డి, ఎన్.శేషుకుమారిలు తెలిపారు.